బంగారం కొనుగోలు విషయంలో సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లో ఉన్న ధరనే చెల్లిస్తుంటే.. కొన్ని కంపెనీలు మాత్రం అదే బంగారాన్ని భారీ డిస్కౌంట్తో కొనుగోలు చేస్తున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ప్రస్తుతం ఔన్సు బంగారం ధర సుమారు 4,600 డాలర్లుగా ఉంటే.. కొన్ని సంస్థలు కేవలం 920 డాలర్లకే అదే బంగారాన్ని కొనుగోలు చేసే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన వెల్లడించారు.
ఈ మేరకు రాబర్ట్ కియోసాకి తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. సాధారణ పెట్టుబడిదారులు స్పాట్ ధరకు బంగారం కొనుగోలు చేస్తున్నారని, అయితే మైనింగ్ రంగంలోని కొన్ని ప్రత్యేక కంపెనీలు ముందుగానే ఒప్పందాలు చేసుకుని భవిష్యత్లో లభించే బంగారాన్ని చాలా తక్కువ ధరకు పొందుతున్నాయని ఆయన వివరించారు.
మైనింగ్ కంపెనీలతో ఒప్పందాలు
కియోసాకి వివరించిన విధానం ప్రధానంగా గోల్డ్ స్ట్రీమింగ్ వ్యాపార నమూనాకు సంబంధించినది. ఒక గోల్డ్ మైన్ కొత్త ప్రాజెక్టును నిర్మించడానికి లేదా ఉన్న గనిని విస్తరించడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరమైనప్పుడు.. స్ట్రీమింగ్ కంపెనీలు ముందుగానే ఆ మైనింగ్ సంస్థకు నిధులు అందిస్తాయి.
దానికి ప్రతిఫలంగా, ఆ గనిలో భవిష్యత్లో ఉత్పత్తి అయ్యే బంగారంలో కొంత భాగాన్ని ముందుగా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసే హక్కును స్ట్రీమింగ్ కంపెనీ పొందుతుంది. ఈ ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో అనేక సంవత్సరాలు లేదా దశాబ్దాల పాటు కొనసాగుతాయని కియోసాకి తెలిపారు.
అంటే.. బంగారం మార్కెట్ ధర ఎంత పెరిగినా, ఒప్పందంలో నిర్ణయించిన తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఆ కంపెనీకి ఉంటుంది. కియోసాకి ఉదాహరణ ప్రకారం, ఔన్సుకు 4,600 డాలర్ల మార్కెట్ ధర ఉన్నప్పుడు సుమారు 920 డాలర్లకు కొనుగోలు చేసే ఒప్పందం ఉంటే.. అది మార్కెట్ ధరతో పోలిస్తే దాదాపు 80 శాతం తక్కువ అవుతుంది.
‘రిచ్ డాడ్’ విధానం ఇదేనా?
ఈ విధానాన్ని కియోసాకి తనకు ఇష్టమైన ‘పూర్ డాడ్–రిచ్ డాడ్’ పోలికతో వివరించారు. సాధారణ పెట్టుబడిదారుడు రిటైల్ ధరకు బంగారం కొనుగోలు చేస్తుంటే.. ‘రిచ్ డాడ్’ తరహా పెట్టుబడిదారుడు నేరుగా బంగారం కొనడం కంటే, బంగారం ఉత్పత్తి చేసే సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రయోజనం పొందే విధానాన్ని ఎంచుకుంటారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒకప్పుడు తోపు రిచ్.. ఇప్పుడు టాప్ 10 కూడా దక్కలేదు!
ఇది చట్టంలోని లొసుగు కాదని, మైనింగ్ పరిశ్రమలో ఇలాంటి ఒప్పందాలు బహిరంగంగా వెల్లడించే చట్టబద్ధమైన వ్యాపార విధానాలని కియోసాకి అన్నారు. చాలా కాలంగా ఈ విధానం కొనసాగుతున్నప్పటికీ.. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మాత్రం వార్తల్లో కనిపించే బంగారం స్పాట్ ధరపైనే దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు.


