
విడుదల చేసిన ఆర్బీఐ
ప్రొవిజన్లు గరిష్టంగా 1.25% అక్టోబర్ 1 నుంచి అమల్లోకి
ముంబై: మౌలిక రంగ ప్రాజెక్టులు, మౌలికేతర ప్రాజెక్టులకు బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు, ఇతర నియంత్రిత సంస్థలు మంజూరు చేసే రుణాలకు సంబంధించి ఆర్బీఐ కొత్త నిబంధనలను విడుదల చేసింది. వీటి ప్రకారం ప్రాజెక్టులు వాణిజ్య కార్యకలాపాల ప్రారంభించే తేదీ (డీసీసీవో) విషయంలో వెసులుబాటు కల్పించింది. ఇన్ఫ్రా ప్రాజెక్టులకు మూడేళ్లు, నాన్ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రెండేళ్ల పాటు డీసీసీవో పొడిగింపు పరిమితికి అవకాశం ఇచ్చింది. కొత్త మార్గదర్శకాల అమలుకు ప్రాజెక్టులను స్థూలంగా.. డిజైన్, నిర్మాణం, కార్యకలాపాల దశలుగా వర్గీకరించారు.
‘‘నిర్మాణ దశలోని ప్రాజెక్టులకు బ్యాంక్లు లేదా ఎన్బీఎఫ్సీల రుణ వితరణ గరిష్టంగా రూ.1,500 కోట్లను మించకూడదు. విడిగా ఒక్కో రుణ దాత ఎక్స్పోజర్ ఇందులో 10 శాతానికి తక్కువ కాకుండా ఉండాలి. రూ1,500 కోట్లకు మించిన ప్రాజెక్టు రుణాల్లో ఒక్కో రుణదాత వారీ వాటా కనీసం 5 శాతం లేదా రూ.150 కోట్లు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. రుణాన్ని ఖరారు చేయడానికి ముందే సంబంధిత ప్రాజెక్టుల నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు/ క్లియరెన్స్లు వచ్చినట్టు ధ్రువీకరించుకోవాలి.
పర్యావరణ, చట్టబద్ధమైన, నియంత్రణ సంస్థల అనుమతులు ఇందులో భాగంగా ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. రుణం మంజూరు చేసిన తర్వాత కూడా బ్యాంక్/ఎన్బీఎఫ్సీ ప్రాజెక్టుల పనితీరును పర్యవేక్షిస్తూ ఉండాలి. సంబంధిత ప్రాజెక్టు సమస్యల్లో పడుతుందన్న సంకేతాలు కనిపిస్తే ముందస్తుగానే పరిష్కార ప్రణాళికకు చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు రుణాలకు సంబంధించి 1.25% ప్రొవిజన్ చేయాల్సి (పక్కన పెట్టడం) ఉంటుంది.
వాణిజ్య–నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఇది ఒక శాతంగా ఉంటుంది. ఇతర ప్రాజెక్టుల రుణాలకు సైతం ఒక శాతం ప్రొవిజన్లు కేటాయించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులు కార్యకలాపాల దశలోకి వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన కేటాయింపులు వరుసగా 1%, 0.75%, 0.40 శాతంగా ఉండనున్నాయి. నిజానికి గతంలో విడుదల చేసిన ముసాయిదా నిబంధనల్లో ప్రాజెక్టు రుణాలకు సంబంధించి.. నిర్మాణ దశలో ఉన్న వాటికి 5 శాతం, కార్యకలాపాలు మొదలు పెట్టిన తర్వాత ఒక శాతం కేటాయింపులు నిర్వహించాలని ఆర్బీఐ ప్రతిపాదించడం గమనార్హం.