అందుకు పాస్‌పోర్ట్‌ ప్రూఫ్‌ కాదు | Passport Citizenship Proof India External Affairs Ministry Clarification | Sakshi
Sakshi News home page

అందుకు పాస్‌పోర్ట్‌ ప్రూఫ్‌ కాదు

Jun 25 2026 11:42 AM | Updated on Jun 25 2026 12:19 PM

Passport Citizenship Proof India External Affairs Ministry Clarification

భారతీయ పాస్‌పోర్ట్‌ అనేది ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణం కోసం జారీ చేసే పత్రం మాత్రమేనని, దానిని భారత పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించరాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్‌ సేవా దివస్‌ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ వివరణ ఇచ్చారు. ఇటీవల పాస్‌పోర్ట్‌, ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలు పౌరసత్వానికి ఆధారమా కాదా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

అధికారుల ప్రకారం, పాస్‌పోర్ట్‌ జారీకి ముందు వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా విస్తృత స్థాయిలో ధ్రువీకరణ ప్రక్రియ నిర్వహించినప్పటికీ, దాని ప్రధాన ఉద్దేశం విదేశీ ప్రయాణాలను సులభతరం చేయడం, విదేశాల్లో వ్యక్తి జాతీయతను నిర్ధారించడం మాత్రమే. అందువల్ల పాస్‌పోర్ట్‌ను పౌరసత్వ ధ్రువీకరణ పత్రంగా చూడరాదని వారు స్పష్టం చేశారు.

మరి పౌరసత్వానికి ఆధారం ఏమిటి?

భారత పౌరసత్వం 1955 పౌరసత్వ చట్టం ప్రకారం జననం, వంశపారంపర్యం, నమోదు, సహజీకరణ (నేచురలైజేషన్‌) లేదా భూభాగ విలీనాల ద్వారా లభిస్తుంది. పౌరసత్వ ధ్రువీకరణ పత్రం (Citizenship Certificate) ఉంటే దాన్ని ప్రత్యక్ష ఆధారంగా పరిగణిస్తారు. అయితే ప్రతి భారతీయుడి వద్ద అలాంటి పత్రం ఉండదు. జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన రికార్డులు, నమోదు లేదా నేచురలైజేషన్‌ పత్రాలు వంటి ఆధారాలు పరిస్థితులను బట్టి పౌరసత్వ నిర్ధారణలో ఉపయోగపడతాయి.

సుప్రీంకోర్టు కూడా గతంలో ఆధార్‌ కార్డు కేవలం గుర్తింపు పత్రమేనని, అది పౌరసత్వానికి రుజువు కాదని స్పష్టం చేసింది. ఇదే విధంగా ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి పత్రాలు కూడా స్వతంత్రంగా పౌరసత్వాన్ని నిర్ధారించవని న్యాయపరమైన అభిప్రాయాలు ఉన్నాయి.

వేగవంతమైన పాస్‌పోర్ట్‌ సేవలు

పాస్‌పోర్ట్‌ సేవల్లో దేశవ్యాప్తంగా గణనీయమైన పురోగతి సాధించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం అనేక సాధారణ దరఖాస్తులు ఐదు పని దినాల్లోనే పూర్తి అవుతున్నాయి. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో దరఖాస్తుదారులు గడిపే సగటు సమయం 45 నిమిషాల కంటే తక్కువకు తగ్గినట్లు అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 545 పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరో 20 కేంద్రాలను ఈ ఏడాది ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం ఒక పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతోంది. మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్‌ బృందాల ద్వారా సేవలను విస్తరిస్తోంది.

ఈ-పాస్‌పోర్ట్‌లు

గత ఏడాది నుంచి చిప్‌ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌ల జారీని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. బయోమెట్రిక్‌ సమాచారంతో కూడిన ఎలక్ట్రానిక్‌ చిప్‌లు, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో భద్రత మరింత బలపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటివరకు కోట్ల సంఖ్యలో ఈ-పాస్‌పోర్ట్‌లు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement