ఈ పెద్దాయన స్టాక్‌ మార్కెట్‌ని ఏలుతున్నారు?, కోట్లు వెనకేసి | Old Man Holds Shares Worth Of Rs 10 Crore L&T And UltraTech Shares, Netizens Reactions Viral - Sakshi
Sakshi News home page

చూడటానికి సింపుల్‌గా ఉన్నారు కదా! స్టాక్‌ మార్కెట్‌లో కోట్లు సంపాదిస్తున్నారు!

Sep 30 2023 3:15 PM | Updated on Oct 1 2023 7:18 AM

Old Man Holds Shares Worth Over Rs 10 Crore - Sakshi

చూశారా!! ఈ పెద్దాయనని. ఈయన ఎవరు? ఏం చేస్తుంటారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఉన్నారా? అయితే, మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆయన గురించి తెలుసుకుందాం పదండి. 

స్టాక్‌ మార్కెట్‌తో డబ్బులు సంపాదించడం ఎలా? అని ఎవరినైనా అడిగితే అమ్మో స్టాక్‌ మార్కెటా? వద్దులే. ఏ బ్యాంకులో డిపాజిట్‌ చేస్తేనో లేదంటే తెలిసిన వాళ్లకి వడ్డీ ఇచ్చుకున్నా నాలుగు రాళ్లు వెనకేసువచ్చు. స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఎందుకు? అలా ఇన్వెస్ట్‌ చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అంటూ స్టాక్‌ మార్కెట్‌ గురించి తెలుసుకోకుండా పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతున్న వారి గురించి కథలు కథలుగా చెప్పుకుంటాం. 

కానీ, స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్‌ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని, అనుభవజ్ఞులైన నిపుణులు సలహాలు తీసుకోవాలి. అలా తెలుసుకునే షేర్లలో పెట్టుబడులు పెట్టారు ఈ పెద్దాయన. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్‌, క్రమశిక్షణ, ఓపిక వహించారు. ఇప్పుడు ముదుసలి వయసులో భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అంటారా?

క్రమశిక్షణ, సహనం ఈ రెండింటిలో ఆరితేరిన బిగ్ బుల్, దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్‌లు స్టాక్‌ మార్కెట్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేసి డివిడెండ్లు, బోనస్ షేర్లు, షేర్ల బైబ్యాక్, స్టాక్ స్ల్పిట్‌లతో లాభాల్ని గడిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్టర్‌ కూడా అంతే. సోషల్‌ మీడియా ఓవర్‌నైట్‌ స్టార్‌ గురించి పెద్దగా వివరాలు వెలుగులోకి రాలేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడులు, ఆస్తులు ఆశ‍్చర్యానికి గురి చేస్తున్నాయి. 

రాజీవ్‌ మెహతా అనే నెటిజన్‌ ఈ పెద్దాయన గురించి వీడియో చేశారు. ఆ వీడియోలో కోట్ల ఆస్తులు ఉన్నా సాధారణ జీవితం గడుపుతున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఆయనకు ఏయే కంపెనీల్లో షేర్లు ఉన్నాయో వివరించారు. ఆ వివరాల ఆధారంగా సదరు పెద్దాయన నికర ఆస్తి విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.  

ఎల్‌అండ్‌టీలో 27,855 షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో 2,475 షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో 4,000 షేర్లు తన వద్ద ఉన్నాయని తన మాతృ భాషలో పెద్దాయన చెప్పడం  ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. నివేదికల ప్రకారం..100 మిలియన్ (రూ.10 కోట్ల) కంటే ఎక్కువ విలువైన షేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అదనంగా, ఆ వ్యక్తి తాను సంవత్సరానికి సుమారుగా రూ. 6 లక్షల డివిడెండ్‌లను సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా రాజీవ్‌ మెహతా మాట్లాడుతూ పెద్దాయన చెప్పినట్లుగా పెట్టుబడులు మీరు అదృష్టవంతులు కావాలని అన్నారు. అంతేకాదు ఎల్ అండ్ టీలో రూ.80 కోట్ల విలువైన షేర్లు, అల్ట్రాటెక్ సిమెంట్‌లో రూ. 21 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంక్‌లో రూ. కోటి విలువైన షేర్లు ఉన్నాయని మెహతా పోస్ట్ చేశాడు.ఇప్పటికీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అని’ మెహతా పేర్కొన్నారు. 

ఆ వీడియోపై క్యాపిటల్ మైండ్ సీఈఓ, ఫౌండర్ దీపక్ షెనాయ్ స్పందించారు. రాజీవ్‌ మెహతా చెప్పిన దానిని బట్టి.. ఎల్ అండ్ టీ కంపెనీలో 27 వేల షేర్ల విలువ రూ. 8 కోట్లు, అల్ట్రాటెక్ కంపెనీలో రూ. 3.2 కోట్ల విలువైన షేర్లు, కర్ణాటక బ్యాంకులో రూ. 10 లక్షల విలువైన షేర్లు.. ఇలా మొత్తంగా రూ. 12 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం, ఈ పెద్దాయన గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement