ఎస్‌పీఎంసీఐఎల్‌కు త్వరలో నవరత్న హోదా! | Nirmala Sitharaman Praised The SPMCIL Could Soon Achieve Navratna Status, Check Out Full Story | Sakshi
Sakshi News home page

ఎస్‌పీఎంసీఐఎల్‌కు త్వరలో నవరత్న హోదా!

Jun 11 2025 9:05 AM | Updated on Jun 11 2025 10:52 AM

Nirmala Sitharaman praised the SPMCIL could soon achieve Navratna status

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్‌) పనితీరు భేషుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. త్వరలోనే నవరత్న హోదాను దక్కించుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ తదితర కార్యకలాపాలు నిర్వహించే ఎస్‌పీఎంసీఐఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

2015లో పునర్‌వ్యవస్థీకరణ అనంతరం 2016–17లో కంపెనీ మొత్తం రుణాన్ని వడ్డీతో సహా చెల్లించేయడంతో పాటు పటిష్టమైన రాబడులు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో భాగమైన ఈ సంస్థకు ప్రస్తుతం షెడ్యూల్‌ ‘ఏ’ మినీరత్న కేటగిరీ–వన్‌ హోదా ఉంది. లాభాలు, నికర విలువ వంటి ఆర్థిక విషయాలతో పాటు నిర్దిష్ట అర్హతా ప్రమాణాలను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు ఇస్తుంది.

ఇదీ చదవండి: చిన్న ఎగుమతిదార్లకు కేంద్రం చేయూత

2022–23లో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.534 కోట్లు డివిడెండ్‌ చెల్లించిన కంపెనీ ఆ తర్వాత సంవత్సరంలో (2023–24) రూ.364 కోట్లు అందించింది. 2024–25లో 1,200 కోట్ల బ్యాంక్‌ నోట్లు, 150 కోట్ల నాణేలు, 1.5 కోట్ల పాస్‌పోర్ట్‌ బుక్‌లెట్స్, 700 కోట్ల పైగా ఎక్సైజ్‌ అడ్హెసివ్‌ లేబుల్స్‌ మొదలైనవి కంపెనీ ఉత్పత్తి చేసింది. కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్వాధీనం చేసుకున్న పసిడిని శుద్ధి చేయడం ద్వారా 3.4 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌కి బదలాయించింది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, వైష్ణోదేవీ బోర్డు నుంచి వచ్చిన వెండి, బంగారాన్ని కూడా రిఫైన్‌ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement