
కొత్త మార్కెట్లలో ఎంట్రీకి ప్రత్యేక పథకం యోచన
మంత్రి పీయుష్ గోయల్ వెల్లడి
కొత్త మార్కెట్లలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడంలో లఘు, చిన్న, మధ్య తరహా ఎగుమతిదార్లకు (ఎంఎస్ఎంఈ) చేయూతనివ్వడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందుకోసం ప్రత్యేక స్కీమును ప్రవేశపెట్టే యోచనలో ఉంది. స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా భారతీయ వ్యాపార వర్గాల బృందంతో భేటీ అయిన సందర్భంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ ఈ విషయాలు తెలిపారు.
‘ఏ ఎంఎస్ఎంఈ అయినా ప్రపంచంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులను నమోదు చేయించుకోవడానికి ఖర్చు చేయాల్సి వస్తే, ఆ మొత్తం భారాన్ని ప్రభుత్వమే భరించే విధంగా ఒక స్కీమును ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. ముఖ్యంగా కొత్త ఉత్పత్తులు, కొత్త మార్కెట్లు, కొత్త ఎగుమతిదార్లకు దీన్ని వర్తింప చేయొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉండగా, మరిన్ని దేశాలతో కుదుర్చుకునే ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: చైనా పప్పులేం ఉడకవు..
బడ్జెట్లో ప్రకటించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్లో (ఈపీఎం) మంత్రి పేర్కొన్న స్కీము భాగంగా ఉంటుందని అంచనా. దీనితో ఎంఎస్ఎంఈలు..ఈ–కామర్స్ ఎగుమతిదార్లకు సులభతర రుణ పథకాలు, విదేశాల్లో వేర్హౌసింగ్ సదుపాయాలు, అంతర్జాతీయంగా బ్రాండింగ్ మొదలైన 12 అంశాల్లో సదరు సంస్థలకు మద్దతు లభిస్తుంది. 2023–24లో 778 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతుల పరిమాణం 2024–25లో 825 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 40 శాతం పైగా ఉంటోంది.