'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు! | Sakshi Guest Column On India-Canada Trade | Sakshi
Sakshi News home page

'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు!

Jun 5 2026 12:39 AM | Updated on Jun 5 2026 12:42 AM

Sakshi Guest Column On India-Canada Trade

కెనడా ప్రధాని మార్క్‌ కార్నీతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌

విశ్లేషణ

వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో కూడిన బృందంతో భారత వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ గత వారం కెనడా పర్యటించటం ఇరు దేశాల సంబంధాలలో కీలక మలు పును సూచిస్తోంది. మార్క్‌ కార్నీ కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి భారత్‌–కెనడా సంబంధాలు అధఃపాతా ళంలో ఉన్నాయి. ఖలిస్తానీ నాయకుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య ఉదంతంలో రెండు దేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని పెద్ద మొత్తంలో బహిష్కరించాయి. ఖలిస్తాన్‌ వివాదం, దౌత్య స్పర్థల్ని నాటి ప్రధాని ట్రూడో తన స్థానిక రాజకీయ చదరంగంలో పావుల్లా వాడుకోవటానికి ప్రయత్నించారు. భారత సంతతికి చెందిన 18 లక్షల కెనడియన్ల ఓట్లకు గాలం వేయటానికి ట్రూడో భారత్‌–కెనడా సంబంధాలను ఫణంగా పెట్టారు. కెనడా పార్లమెంటులో బహిరంగంగా నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ హస్తమున్నదని (అండర్‌ కవర్‌ ఆపరేషన్‌) ఆరోపించారు. 

సంబంధాలలో సరికొత్త అధ్యాయం
మార్క్‌ కార్నీ ప్రధాని కాగానే భారత్‌తో సంబంధాలను పునరు ద్ధరించటంపై దృష్టి పెట్టారు. 2023 అక్టోబర్‌లో దౌత్యవేత్తల బహి ష్కరణ తర్వాత 2025 సెప్టెంబర్‌లో తిరిగి హైకమిషనర్లను పునర్ని యమించారు. అదే నెలలో ఇరు దేశాల భద్రతా సలహాదార్లు సమా వేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కార్నీ నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించటంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2010 నుండి పదహారేళ్లుగా నత్తనడక నడుస్తున్న భారత్‌–కెనడా వాణిజ్య చర్చలను పరుగులు పెట్టించి 2026 సంవత్సరాంతానికి ‘కాంప్రహెన్సివ్‌ ఎకనమిక్‌ అండ్‌ పార్ట్‌నర్‌షిప్‌ అగ్రిమెంట్‌’ (సీఈపీఏ)ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు చేసి 50 బిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.

భారత్‌–కెనడా వాణిజ్యం కేవలం కొన్ని వస్తువులు, సేవలకే పరిమితమై ఉంది. కెనడా నుండి మనం పప్పుధాన్యాలు, చమురు, గ్యాస్, బొగ్గు, కలప, కాగితం, ఎరువులు, వైమానిక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. కెనడాకు భారత్‌ విలువైన రాళ్లు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. నిజానికి ఈ వాణిజ్యాన్ని విస్తరించటానికి అవకాశాలు ఉన్నాయి. భారత్‌ 2070 కల్లా నెట్‌–జీరో కార్బన్‌ లక్ష్యాన్ని సాధించాలంటే అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరింపజేయాలి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కనీసం సాలీనా 5 వేల టన్నుల యురేనియం అవసరమవుతుంది. మన దేశంలో సాలీనా 600 టన్నుల యురేనియంను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. భారత్‌లో ఉన్న 24 అణు రియాక్టర్లలో 14 యురేనియం కొరత వలన సామర్థ్యం కంటే దిగువన పని చేస్తున్నాయి. 

చైనాకు ప్రత్నామ్నాయంగా కెనడా
కెనడా, ప్రపంచంలో రెండవ అతి పెద్ద యురేనియం ఉత్పత్తి దారు. అత్యంత నాణ్యమైన యురేనియం సిగార్‌ సరస్సు, మెక్‌– ఆర్థర్‌ నదీ పరివాహకాలలో ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచ మార్కె ట్లలో లభించే ఆస్ట్రేలియా, కజకిస్తాన్‌ యురేనియంతో పోల్చితే కెనడా యురేనియం నాణ్యమైనది, చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020లో కాలం చెల్లిన 2015 ఒప్పందం స్థానంలో భారత్‌– కెనడాల మధ్య 2.5 బిలియన్‌ డాలర్ల విలువైన యురేనియం ఒప్పందంపై కార్నీ భారత పర్యటనలో అంగీకారం కుదిరింది.

యుద్ధ విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, ఏఐ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్‌ రంగాలకు కీలకమైన 24 రకాల అరుద యిన ఖనిజాల విషయంలో భారత్‌ దాదాపుగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్నది. లాంథనం, సెరియం, నియోడిమియం, సమారియమ్, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం తదితర అరుదైన ఖనిజాలు కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ సముద్రతీర మోనజైట్‌ ఇసుక లలో లభిస్తాయి. కానీ మోనజైట్‌ను శుద్ధి చేసి ఆ ఖనిజాలను వేరు చేసే సామర్థ్యం భారత్‌కు లేదు. ముడి మోనజైట్‌ను చైనాకు ఎగుమతి చేసి, శుద్ధి చేసి, వేరుపరిచిన ఖనిజాలతో తయారయిన మాగ్నెట్లను, బ్యాటరీలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అరుదైన ఖనిజాల శుద్ధి, మాగ్నెట్లు / బ్యాటరీల తయారీ వ్యవస్థ కెనడా వద్ద ఉన్నప్పుడు చైనాపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం. 

ఈ నేపథ్యంలోనే అరుదైన ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, మాగ్నెట్ల తయారీకి కెనడాతో అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరాంతానికి కెనడా కంపెనీల భాగస్వామ్యంతో కనీసం అయిదు ప్రాజెక్టులను ఈ రంగంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్‌ వాటా 40 శాతం. సుమారు 4.27 లక్షలమంది భారతీయులు కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది 15 బిలియన్‌ డాలర్లను కెనడాకు చెల్లిస్తున్నారు. 21 కెనడా యూనివర్సిటీల అధిపతులు కార్నీ వెంట భారత్‌కు వచ్చారు. భారత్‌లో కెనడియన్‌ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు, భారత్‌–కెనడా యూనివర్సిటీల ఉమ్మడి కోర్సుల నిర్వహణకు, విద్యార్థుల మారకానికి, ఏఐ గ్రీన్‌ హైడ్రోజన్‌ క్వాంటమ్‌ మెకానిక్స్‌ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు 200కు పైగా ఒప్పందాలు జరిగాయి.

సుంకాల రద్దుకు సమాలోచనలు
ఆర్కిటిక్, పసిఫిక్‌ తీరాలు కలిగి ఉన్న కెనడాలో రక్షణ–భద్రత రంగాలలో కూడా భారత్‌ సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. రానున్న దశాబ్దాలలో ఇండో–పసిఫిక్, ఆర్కి టిక్‌ జలాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. అందుకే నౌకా నిర్మాణం, సబ్‌మెరైన్లు, సముద్ర జలాలలో నిఘా వంటి అంశాలలో ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులను ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. భారత ఆర్థిక సేవల రంగంలో కెనడియన్‌ పెన్షన్‌ ఫండ్‌ల పెట్టుబడులు కీలకం. 140 బిలియన్‌ కెనడియన్‌ డాలర్లను భారత దేశపు ఎనర్జీ, ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్, ఈక్విటీ, బాండ్‌ సెక్యూరిటీలలో కెనడా పెట్టుబడిగా పెట్టింది. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇరువైపులా సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. 

కానీ భారత్‌కు ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కెనడా పప్పుధాన్యాలు, నూనెల దిగుమతులపై 15–30 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వ్యవసాయ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే మన రైతులు, వ్యవ సాయంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈపీఏ ఒప్పందం ఖాయం చేయాలంటే సుంకాలతోపాటు అనేక ఇతర సంక్లిష్ట అంశాలలో ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవలు, పెట్టుబడుల రక్షణ, వివాదాల పరిష్కారం, మేధోహక్కుల పరిరక్షణ, కార్మిక, పర్యావరణ ప్రమాణాలు వంటి విషయాలలో మన దేశం రాజీ పడలేదు. కొత్త భాగస్వాముల వేటలో ఉన్న కెనడాతో పటిష్ట సంబంధాలు ఏర్పరచుకోవటంఉభయ తారకం.

గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement
 
Advertisement
Advertisement