భారత్ - 27 దేశాల యూరోపియన్ యూనియన్ మధ్య కుదరబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థికాభివృద్ధికి ఒక కీలక మైలురాయిగా మారనుంది. ఈ ఒప్పందంపై 2026 డిసెంబర్ నాటికి సంతకం చేసే అవకాశం ఉందని, ఆ తరువాత 2027 ఫిబ్రవరి - మార్చి నెలలలో అమలులోకి రానున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందాన్ని 'అన్ని ఒప్పందాలకు మాతృక' (Mother of All Deals) లాంటిదని అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలవనుంది. భారత్ - ఈయూ కలిసి ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో సుమారు 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా.. ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యంలో దాదాపు మూడవ వంతు వాటా ఈ రెండు భాగస్వామ్యాలదే.
ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత, భారతదేశం నుంచి ఈయూ దేశాలకు ఎగుమతి చేసే సుమారు 93 శాతం వస్తువులకు సుంకం లేకుండా మార్కెట్ ప్రవేశం లభిస్తుంది. దీని వలన భారతీయ వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు వంటి అనేక రంగాలకు భారీ అవకాశాలు ఏర్పడతాయి.
మరోవైపు, ఈయూ దేశాల నుంచి దిగుమతి అయ్యే లగ్జరీ కార్లు, వైన్ వంటి వస్తువులపై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల భారత వినియోగదారులు ఈ ఉత్పత్తులను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే దేశీయ పరిశ్రమలపై ప్రభావం పడకుండా తగిన రక్షణ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచ దేశాల దృష్టి భారతదేశంపై ఉందని పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో అనేక దేశాలు ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికాతో కూడా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. అలాగే కెనడా కూడా భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం!


