
భౌగోళిక రాజకీయ అడ్డంకులు ఉన్నప్పటికీ యాపిల్ దాని ప్రధాన తయారీ భాగస్వామి ఫాక్స్కాన్ భారతదేశంలో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకు సాగుతోంది. చైనాకు వెలుపల ఉత్పత్తిని వైవిధ్యపరచడానికి యాపిల్ దీర్ఘకాలిక వ్యూహానికి అనుగుణంగా ఈ చర్యలు చేపడుతోంది. అయితే యాపిల్ భారత్లో తయారీ విస్తరణపై డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకతను హైలైట్ చేస్తూ కీలక సిబ్బంది బదిలీలకు చైనా అడ్డుకట్ట వేస్తోంది.
యాపిల్ భారత్లో విస్తరణ ప్రపంచ సరఫరా గొలుసులకు కీలకంగా మారింది. ముఖ్యంగా కొవిడ్ -19 కాలంలో, పెరుగుతున్న యూఎస్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ విస్తరణ ఎంతో కలిసివస్తోంది. దాంతో కొన్ని సంవత్సరాలుగా యాపిల్ దేశంలో తన ఐఫోన్ తయారీని క్రమంగా పెంచుతోంది. 2024లో ఎగుమతులు 17 బిలియన్ డాలర్లకు పెరిగాయి. మొదటిసారి ఇవి దేశ ఫార్మాస్యూటికల్ ఎగుమతులను అధిగమించాయి. ఇది మొత్తం ఐఫోన్ ఉత్పత్తిలో దాదాపు 7% వాటాను కలిగి ఉంది. ఈ సంఖ్య 2026 నాటికి 25%కు పెరుగుతుందని భావిస్తున్నారు.
చైనా హైలైట్ చేస్తున్న కీలక అంశాలు
ట్రంప్ ప్రతిఘటన..
యాపిల్ సీఈఓ టిమ్కుక్ను భారత్లో ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలు చేపట్టవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక్షంగానే హెచ్చరించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడం, భౌగోళిక ప్రమాదాలను నిర్వహించడం లక్ష్యంగా అమెరికాకు వెళ్లే ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించే యాపిల్ ప్రణాళికకు ఇది విరుద్ధంగా ఉంది.
చైనా పుష్ బ్యాక్..
చాలాకాలంగా యాపిల్ సరఫరా గొలుసుకు కేంద్రంగా ఉన్న చైనా కీలక ఇంజినీర్లను భారతదేశానికి మకాం మార్చకుండా నిరోధిస్తోంది. ఇది చైనా వెలుపల దాని అధునాతన తయారీ ప్రక్రియలను ప్రతిబింబించే యాపిల్ సామర్థ్యాన్ని పరిమితం చేస్తోంది. ముఖ్యంగా ఉత్పత్తిలో నాణ్యత నియంత్రణ, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో టాలెంట్ అడ్డంకి ఆపరేషనల్ సవాళ్లను కలిగిస్తుంది.
ఇదీ చదవండి: వేగంగా హాస్టళ్ల మూసివేత
ఫాక్స్కాన్ దూకుడు
ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ ఫాక్స్కాన్ ఇప్పటి వరకు భారత్లో భారీ పెట్టుబడులతో ముందుకు సాగుతోంది. 30,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించేలా భారీ క్యాంపస్ను నిర్మిస్తోంది. హైటెక్ తయారీని ఆకర్షించడానికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం కింద ప్రోత్సాహకాలను అందిస్తూ భారత ప్రభుత్వం విస్తరణకు చురుకుగా మద్దతు ఇస్తోంది.