వేగంగా హాస్టళ్ల మూసివేత | why Bengaluru PG accommodations are facing a mass shutdowns | Sakshi
Sakshi News home page

వేగంగా హాస్టళ్ల మూసివేత

Jun 10 2025 1:44 PM | Updated on Jun 10 2025 2:52 PM

why Bengaluru PG accommodations are facing a mass shutdowns

బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల మూసివేత వేగంగా జరుగుతోంది. నగరంలోని టెక్ కారిడార్లలో వీటిని మరింత ఎక్కువగా క్లోజ్‌ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కఠినమైన కొత్త పౌర నిబంధనలు, టెక్ కంపెనీలు తమ సిబ్బందికి లేఆఫ్స్‌ ప్రకటిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

బెంగళూరులోని మహదేవపుర, మారతహళ్లి వంటి ప్రాంతాల్లో పీజీలు 25 శాతం వరకు ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ప్రతిరోజూ రెండు పీజీలు మూతపడుతున్నాయని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఈ వ్యవహారాన్ని గమనించిన ఇన్వెస్ట్‌మెంట్‌ అనలిస్ట్ హార్దిక్ జోషి ఈ అంశంపై తన లింక్డ్‌ఇన్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ‘ఇది వేలాది మందిని ప్రభావితం చేసే నిశ్శబ్ద సంక్షోభం’ రాసుకొచ్చారు.

బీబీఎంపీ చట్టంలో నిబంధనలు

గత ఏడాది బీబీఎంపీ చట్టం 2020లోని సెక్షన్ 305 కింద బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ప్రవేశపెట్టిన పలు నిబంధనలతోనే ఇలా పీజీలు మూతపడుతున్నట్లు కొందరు చెబుతున్నారు. ఈ చట్టంలో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. పీజీ ఆపరేటర్లు ట్రేడ్ లైసెన్సులు పొందాలి. పరిశుభ్రత, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పాటించాలి. పీజీలో ఉంటున్న ప్రతి వారికి కనీసం 70 చదరపు అడుగుల నివాస స్థలాన్ని కేటాయించాలి. 40 అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్న రోడ్లపై ఉన్న పీజీలను ఇకపై ఆపరేట్ చేయడానికి అనుమతి లేదు.

టౌన్ ప్లానింగ్, లైసెన్సింగ్ ఉల్లంఘనలకు సంబంధించి ఒక్క మహదేవపుర జోన్‌లోనే ఏప్రిల్‌లో 100కు పైగా పీజీ కిచెన్లను సీజ్ చేశారు. విస్తృత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌లో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఆపరేటర్లు అన్ని సాధారణ ప్రాంతాలను కవర్ చేస్తూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, ప్రతి నివాసికి రోజుకు కనీసం 135 లీటర్ల నీటి సరఫరా జరిగేలా చూడాలని, భోజనం వడ్డిస్తే ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు పొందాలని సూచించారు.

12,000 పీజీల్లో 2,500కే రిజిస్ట్రేషన్‌

బెంగళూరు పీజీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి సుఖీ సియో మాట్లాడుతూ నగరంలో 12,000 పీజీలకు గాను 2,500 మాత్రమే అధికారికంగా రిజిస్టర్ అయ్యాయని తెలిపారు. ఇప్పటికీ 10 వేలకు పైగా అనుమతులు లేకుండా అక్రమంగా నడుస్తున్నాయని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై బీబీఎంపీ ఎప్పుడైనా దాడులు నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. చాలా టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి. దాంతో స్థానికంగా పీజీల్లో ఉంటున్నవారు ఖాళీ చేస్తున్నారు. ఇది కూడా ఒకింత పీజీలు తగ్గేందుకు కారణంగా నిలుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement