సాక్షి, హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెరాలో నమోదైన అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల పూర్తి గడువును నాలుగు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 28, 2026 నాటికి లేదా ఆ తర్వాత పూర్తికావాల్సిన అన్ని రెరా నమోదిత ప్రాజెక్టులకు ఈ పొడిగింపు వర్తిస్తుందని వెల్లడించింది.
పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల అమల్లో జాప్యం ఏర్పడే అవకాశాలను టీజీ రెరా పరిగణనలోకి తీసుకుంది. నిర్మాణ సామగ్రి సరఫరా, రవాణాపై యుద్ధ పరిస్థితుల ప్రభావం ఉండటంతో ప్రాజెక్టుల గడువును నాలుగు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా గడువు ముగింపు దశలో ఉన్న రెరా నమోదిత ప్రాజెక్టుల ప్రమోటర్లకు ఊరట లభించనుంది.


