కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
నరసరావుపేటలో క్రెడిట్ ఔట్ రీచ్ కార్యక్రమం
సాక్షి, నరసరావుపేట: ప్రజలు బ్యాంకులకు వెళ్లి అప్పులు తెచ్చుకునే రోజుల నుంచి బ్యాంకులే ప్రజల వద్దకు వచ్చి రుణాలు ఇచ్చే మార్పు వచ్చిందని, దీనికి కారణం ప్రధాని నరేంద్రమోదీ అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో శుక్రవారం క్రెడిట్ ఔట్ రీచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జిల్లాలో 1,03,246 మంది లబ్దిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి బ్యాంకులు ఎన్పీఏల సమస్యలతో ఇబ్బందుల్లో ఉండేవని, చిన్న వ్యాపారులు అప్పులు దొరక్క నష్టపోయేవారని చెప్పారు. నేడు బ్యాంకులు స్వయంగా వ్యాపారుల చెంతకే వచ్చి రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సిఫార్సులతో బ్యాంకుల్లో అప్పులు దొరికేవని, ప్రస్తుతం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు లభిస్తున్నాయని చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రసంగం చివర్లో భారత్మాతాకి జై అని గట్టిగా అరవాలని.. పల్నాడు బలం ఢిల్లీకి వినిపించాలని ఆమె సభికుల్లో ఉత్సాహం నింపారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులొచ్చాయని చెప్పారు. రైతు భవిష్యత్తు మార్చడానికి, యువత కలలు నెరవేర్చడానికి, పారిశ్రామికవేత్తల లక్ష్యం నెరవేరడానికి రుణాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. క్రెడిట్ అవుట్ రీచ్ను సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు.
కేంద్ర సహకారంతో అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు ఆకాంక్షలు నెరవేరుతున్నాయని చెప్పారు. వచ్చే మార్చిలోపు పోలవరం మొదటిదశ పూర్తిచేసి తీరతామన్నారు. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్గా మారుస్తామన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు ఇప్పటివరకు నిండలేదని, నిండే ఛాయలు కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు, బ్యాంక్ ఉన్నతాధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.


