తడి ఆరని పురిటిలోన.. తనువంతా హూనం
అంబులెన్స్ వసతి లేక మాతృమూర్తికి నరకం
నాలుగు రోజుల పసికందుతో 45 కి.మీ. బస్సు ప్రయాణం
మరో 13 కి.మీ. జీపులో.. అక్కడి నుంచి జోరువానలో బైక్పై స్వగ్రామానికి
చంద్రబాబు పాలనలో గిరిజన మహిళ వేదన వర్ణనాతీతం
సీలేరు: చంద్రబాబు పాలనలో పురిటి తడి ఆరని బాలింతలు నరకం చవిచూస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్, అంబులెన్స్ సౌకర్యం లేక సొంతిళ్లు చేరే దారిలేక తల్లడిల్లుతున్నారు. విధిలేక బస్సుల్లోనే గతుకుల రోడ్లపై కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. తనువంతా హూనమై తీరని వేదన అనుభవిస్తున్నారు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయతీ పాతూరుగుంట గ్రామానికి చెందిన బాలింత లక్ష్మి వైద్యం అనంతరం తిరుగుపయనంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
లక్ష్మి ఈనెల 14న ఇంటి వద్దే మగబిడ్డకు ప్రసవించింది. శిశువుకు కురుపులు రావడంతో అదేరోజు సప్పర్ల పీహెచ్సీకి తరలించారు. అక్కడ రెండురోజుల చికిత్స అనంతరం చింతపల్లి ఏరియా ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స తర్వాత శుక్రవారం సాయంత్రం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. సొంతూరికి తిరిగి వెళ్లడానికి అంబులెన్సు వసతి కల్పించాలని బాలింత భర్త భాస్కరరావు కోరినా ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేది లేక లక్ష్మి నాలుగు రోజుల పసికందుతో బస్సులో సుమారు 45 కిలోమీటర్ల దూరం గుంతల రహదారిపై ప్రయాణించి సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి తమ గ్రామం మరో 20 కిలోమీటర్లు ఉండడంతో అంబులెన్సు సౌకర్యం గురించి మరోమారు పీహెచ్సీ సిబ్బందిని అడగ్గా వాహనంలో డీజిల్ లేదని, మరుసటి రోజు వరకు వేచి ఉండాలని చెప్పారు. దీంతో జీపులో 13 కి.మీ ప్రయాణించి తల్లీబిడ్డలను గాలికొండకు చేర్చారు. అక్కడి నుంచి మరో ఆరు కిలోమీటర్ల పైగా మట్టి రహదారిలో జోరు వర్షంలో ద్విచక్రవాహనంపై ప్రయాణించి గ్రామానికి చేరుకున్నట్టు భర్త భాస్కరరావు చెప్పారు. తన భార్య లక్ష్మి నరకం చవిచూసిందని ఆవేదన వ్యక్తం చేశారు.


