జువ్వలదిన్నె హార్బర్ను ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్ల ఆహ్వానం
ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా టెండర్లు ఆహ్వానించిన చంద్రబాబు ప్రభుత్వం
తొలుత ఐదేళ్లు.. ఆపై మరో ఐదేళ్లు హార్బర్ అప్పగింత
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే హార్బర్ పనులు పూర్తి
రెండేళ్లుగా గాలికొదిలేసి.. తీరా ఇప్పుడు స్కామ్ల కోసం ప్రైవేట్కు ధారాదత్తం
ప్రభుత్వ నిధులతో నిర్మించిన హార్బర్ను ఎందుకు ప్రైవేట్కు కట్టబెడుతున్నారు?
ఇప్పటికే 30 ఎకరాలు సాగర్ డిఫెన్స్కు అప్పగింత.. మిగిలింది కూడా ఇచ్చేస్తే మత్స్యకారుల పరిస్థితి ఏమిటి?.. వారి జీవనోపాధికి గండి కొట్టడం కాదా? ఇదంతా మీకింత–నాకింత అంటూ దండుకునేందుకేగా?
వైఎస్ జగన్ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి
4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు మరోసారి వెన్నుపోటు పొడిచింది. వారి జీవనోపాధి కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.306.29 కోట్లతో అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేస్తోంది. వేలాది బోట్లు అక్కడ నిలుపుకునే అవకాశం కల్పించడం ద్వారా మత్స్యకారులకు అండగా నిలవాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టేస్తోంది.
ఇప్పటికే ఈ హార్బరులో 30 ఎకరాలను సాగర్ డిఫెన్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించిన బాబు సర్కారు.. తాజాగా మిగిలిన స్థలాన్ని కూడా ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేయడానికి బరితెగించింది. తద్వారా మత్స్యకారుల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయంతో ఒక్క జువ్వలదిన్నె ప్రాంతంలోనే 6 వేలకు పైగా మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బ తీయనుంది. హార్బర్ను ప్రైవేట్కు దోచిపెట్టి.. మీకింత–నాకింత అని దోచుకునేందుకే ఇలా చేస్తున్నారని స్పష్టమవుతోంది.
ఈ క్రమంలో గత ప్రభుత్వంలోనే అభివృద్ధి చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు బిడ్లను ఆహ్వానించింది. ఈ హర్బర్ను ఐదేళ్ల కాలానికి ఆపైన మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం కల్పించేలా చంద్రబాబు సర్కారు బిడ్లను పిలిచింది. ఈ హార్బరు పనులు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యి.. 2024 ఆగస్టు 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటికీ, రెండేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకుండా చంద్రబాబు సర్కారు గాలికి వదిలేసింది.
తీరా రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హార్బర్ను నిర్వహించేందుకు ఆసక్తిగల సంస్థలు సెపె్టంబర్ 2వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని ఆహ్వానించింది. ఈ హార్బరుకు రోడ్డు, రైలు, పోర్టుతో కనెక్టివిటీతో పాటు అన్ని రకాల మౌలిక వసతులున్నట్లు పేర్కొంది. వైఎస్ జగన్ హయాంలో తీర ప్రాంత అభివృద్ధి పరుగులు పెట్టింది. రూ.26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు శ్రీకారం చుట్టి.. మత్స్యకారుల జీవనగతి మారేలా అడుగులు ముందుకు వేశారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది.
తీరాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో..
ఏపీ తీరాన్ని చంద్రబాబు సర్కారు దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో ప్రైవేటు వాళ్లకు పంచి పెట్టేస్తోంది. దండుకున్న దాంట్లో మీకింత–మాకింత విధానాన్ని అవలంబిస్తోంది. సంపద సృష్టిలో భాగంగా వైఎస్ జగన్ సర్కారు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేసేస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టును ప్రైవేటు వాళ్లకి అప్పగించడానికి టెండర్లు పిలిచిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కూడా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి టెండర్లు ఆహ్వానించింది.
అంతేకాకుండా కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టుల పరిధులను తగ్గించేసింది. ఇలా పరిధిని తగ్గించిన తర్వాత ప్రైవేటు సంస్థల కోసం ఏకంగా 6,248 ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో ఏపీ మారిటైమ్ బోర్డుకు చెందిన 45 ఎకరాలను 30 ఏళ్ల దీర్ఘకాలిక లీజు కింద సేఫ్ వన్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఇచ్చేసింది.
తీర ప్రాంతం అభివృద్ధి పేరిట ఏపీ మారిటైమ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంట్ గైడ్ లైన్స్–2026 విడుదల చేసి.. వాటర్ ఫ్రంట్ ఏరియా, తీరం, ఉప్పు సాగు భూములను అభివృద్ధి పేరిట కావాల్సిన వారికి కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు అయితే ఏకంగా తన దగ్గర లేని భూమిని.. ఇంకా ఏర్పాటు కాని నెక్సస్ ఇంటిగ్రేటెడ్ పార్కుకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చేసిందంటే దోపిడీ ఏవిధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఎడాపెడా నిర్మాణ వ్యయం పెంపు
⇒ రెండేళ్లయినా కొత్తగా ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టకపోగా, నిర్మాణంలో ఉన్న వాటిని నిలిపి వేసి.. ఇప్పుడు కమీషన్ల కోసం ఏకంగా టెండర్ల విలువను భారీగా పెంచేసి నిలువు దోపిడీకి సిద్ధమైంది చంద్రబాబు సర్కారు.
⇒ గత వైఎస్ జగన్ ప్రభుత్వం తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు ప్రారంభించి.. రెండో దశలో బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక, బియ్యపు తిప్ప, ఓడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇస్తూ టెండర్లు పిలిచింది.
⇒ చంద్రబాబు సర్కారు రెండేళ్లుగా తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా ఓడరేవు వంటి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులను ఆపేయడమే కాకుండా బుడగట్లపాలెం, కొత్తపట్నం, పూడిమడక హార్బర్ల నిర్మాణ విలువను భారీగా పెంచేసి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ మూడు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ వ్యయం రూ.1,150.22 కోట్లుగా నిర్ణయిస్తే.. ఇప్పుడు దానికి అదనంగా ఏకంగా రూ.436.41 కోట్లు పెంచేసి రూ.1,586.63 కోట్లకు చేర్చింది.
⇒ ఇందులో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బరు నిర్మాణ వ్యయం రూ.365.81 కోట్ల నుంచి రూ.444.75 కోట్లకు, కొత్తపట్నం హార్బర్ నిర్మాణ వ్యయం రూ.392.41 కోట్ల నుంచి రూ.441.88 కోట్లకు పెంచుతూ పరిపాలనా అనుమతులు జారీ చేసింది.
⇒ పూడిమడక హార్బర్ను ప్రభుత్వం ద్వారా కాకుండా, పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని రూ.392 కోట్ల నుంచి ఏకంగా రూ.700 కోట్లకు పెంచేయడం హార్బర్ల పేరుతో చంద్రబాబు సర్కారు చేస్తున్న నిలువు దోపిడీకి అద్దం పడుతోంది.
⇒ రూ.417.55 కోట్లతో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ప్రకాశం జిల్లా ఓడరేవు హార్బర్ నిర్మాణ పనులు 25 శాతం లోపే ఉన్నాయంటూ 2024 సెప్టెంబర్ 27న ఆ టెండర్లను రద్దు చేస్తూ పనులను అర్ధంతరంగా ఆపేసింది.


