గుండెపోటుతో శ్రీకాకుళం జిల్లాలో వృద్ధుడి మృతి
టెక్కలి రూరల్: 108 ఆలస్యంగా రావడంతో శ్రీకాకుళం జిల్లాలో వృద్ధుడు మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..నందిగాం మండలం కొత్తఆగ్రహారానికి చెందిన ఆనందరావు(70)కు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం 11 గంటలకు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే వైద్యులు ఆ వ్యక్తికి ఈసీజీ తీసి పరిస్థితి విషమంగా ఉందని ఇంజెక్షన్ వేసి వెంటనే శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అయితే 11:30 నుంచి ఆనందరావు కుటుంబసభ్యులు 108కి ఫోన్ చేస్తున్నప్పటికి కలవకపోవడం, కలిసినా ఖాళీ లేదని చెప్పడంతో చాలా సమయం ఎదురుచూశారు.
108 రాకపోవడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఆ వృద్ధుడు మృతిచెందాడు. అనంతరం మధ్యాహ్నం 2.10 సమయంలో కోటబొమ్మాళికి చెందిన 108 వచ్చింది. కుటుంబసభ్యులు 108 సిబ్బందిని ప్రశ్నించగా తమకు కాల్ ఇప్పుడే వచ్చిందని అందుకే వచ్చామని చెప్పారు. అయితే సుమారు రెండున్నర గంటల వ్యవధిలో ఒక్క 108 వాహనం కూడా రాకపోవడం వల్లనే ఆనందరావు మృతి చెందాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు. చివరకు మృతదేహాన్ని ప్రైవేట్ అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు.


