కమీషన్ల ‘షాక్’తో ట్రాన్స్కో టెండర్ల రేసు నుంచి దిగ్గజ సంస్థలు ఔట్
రింగ్ మాస్టర్లు కూడబలుక్కుని ట్రాన్స్కో టెండర్లకు సింగిల్ బిడ్లు
ఒకే నెలలో 30 పనులకు టెండర్లు ఆహ్వానం
పోటీకి కూడా ముందుకురాని సంస్థలు
అన్నిటికీ సింగిల్ టెండర్లే
టెండర్ల వెనుక కమీషన్లే అసలు కారణం
పాలకులపై సడలుతున్న విశ్వాసం మరో కారణం
సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్కో భారీ విద్యుత్ ప్రాజెక్టుల టెండర్లలో పోటీ కరువవుతోంది. రూ.కోట్ల విలువైన పనులకు ఒక్కో కంపెనీ మాత్రమే బిడ్ వేయడానికి ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం.. కమీషన్ల షాక్ వంటి కారణాల వల్ల ట్రాన్స్కో టెండర్ల రేసు నుంచి దిగ్గజ సంస్థలు వైదొలుగుతున్నాయి. దీనిని ఆసరా చేసుకుని రింగ్ మాస్టర్లు ట్రాన్స్కోతో ‘పవర్’ గేమ్ ఆడుతున్నాయి. రింగ్ మాస్టర్లు కూడబలుక్కుని సింగిల్ బిడ్లు దాఖలు చేస్తుండటం ఇంధన రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టెండర్లలో పోటీ లేకపోతే ప్రభుత్వానికి తక్కువ ధరలో పనులు చేయించుకునే అవకాశం తగ్గిపోతుందని, తద్వారా ప్రజాధనం వృథా అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకటి.. రెండు సంస్థలే దిక్కు
ఏపీ ట్రాన్స్కో ఈ ఏడాది మే నెలలో రాష్ట్రవ్యాప్తంగా 30 భారీ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, బీఈఎస్ఎస్ (బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్) కనెక్టివిటీ, 33 కేవీ ఫీచర్ల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ టెండర్లలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిన పనులు ఉన్నాయి.
అలాగే ప్రకాశం జిల్లాలో 400 కేవీ సనంపూడి సబ్స్టేషన్, 118 కిలోమీటర్ల 400 కేవీ లైన్, అనంతపురంలో 275 మెగావాట్లు (550 మెగావాట్), 225 మెగావాట్లు (450 మెగావాట్) బీఈఎస్ఎస్ కనెక్టివిటీ వంటి భారీ ప్రాజెక్టులకు కూడా టెండర్లు పిలిచారు. ఇలాంటి భారీ పనులకు పోటీ పడాల్సిన నిర్మాణ సంస్థలు మొహం చాటేస్తున్నాయి. దాదాపు 90 శాతం ప్రాజెక్టులకు సింగిల్ బిడ్లు మాత్రమే దాఖలయ్యాయి. మిగతా వాటికి కూడా రెండు, మూడు సంస్థలు మాత్రమే పోటీ పడుతున్నాయి.
రింగ్ మాస్టర్లదే హవా
విద్యుత్ సంస్థల్లో టెండర్లను దక్కించుకోవడానికి కొందరు కాంట్రాక్టర్లు రింగ్ అయినట్టు సమాచారం. ఇప్పటికే వీరు పలు దఫాలుగా సమావేశమై టెండర్లలో పాల్గొనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. సింగిల్ టెండర్లు లేదా తమకు లాభం వచ్చేలా ధరలు ఉండేలా టెండర్ ప్రక్రియను ప్రభావింతం చేయాలని వారు నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలిసినా అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. అందుకు కారణం కమీషన్లు. ప్రజాప్రతినిధులు, కొందరు అధికారులకు కమీషన్లు ఇస్తున్నామని పలువురు కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు.
పెరిగిన ధరలు, ఇవ్వాల్సిన కమీషన్ల వాటా ఖర్చులతో పోల్చుకునే తాము టెండర్లు దాఖలు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదని ఇంధన రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు, అర్హతా ప్రమాణాలు కొద్దిమంది కాంట్రాక్టర్లకే అనుకూలంగా మార్చేయడం, ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడం కూడా పెద్దపెద్ద సంస్థలు టెండర్లు వేయకపోవడానికి ప్రధాన కారణమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిని మార్చడం కోసం పోటీ పెరిగేలా టెండర్ విధానంలో మార్పులు చేయాలని, పారదర్శక విధానాన్ని తీసుకురావాలని విద్యుత్ రంగ వర్గాలు సూచిస్తున్నాయి.


