మహాద్వారం గుండా అనుమతి లేని వ్యక్తి ప్రవేశం!
విచారణకు భక్తుల డిమాండ్
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా శుక్రవారం శ్రీరంగం నుంచి పట్టువ్రస్తాల సమర్పణ వైభవంగా జరుగుతుండగా, మరోవైపు మహాద్వారం గుండా అనుమతి లేకుండానే ఓ వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. భక్తులు, హిందూ సంఘాల ప్రతినిధుల కథనం ప్రకారం.. రాజారెడ్డి అనే వ్యక్తి అధికారిక అనుమతి లేకుండానే శుక్రవారం తిరుమల ఆలయ మహాద్వారం ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో తమిళనాడు దేవదాయశాఖ మంత్రి, కమిషనర్, వారి కుటుంబ సభ్యులతో కూడిన బృందానికి టీటీడీ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు సమాచారం. అయితే, ఆ అధికారిక జాబితాలో లేని వ్యక్తి వారితో పాటు లోపలికి వెళ్లాడని ఆరోపిస్తున్నారు. మహాద్వారం వద్ద విధులు నిర్వహించే విజిలెన్స్ అధికారులు ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మాత్రమే లోపలికి అనుమతించాల్సి ఉండగా, ఈ ఘటనలో ఆ ప్రక్రియ సక్రమంగా అమలు కాలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని భక్తులు, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


