నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?! | Machilipatnam Woman Incident | Sakshi
Sakshi News home page

నా భర్తతోనే అక్రమ సంబంధం పెట్టుకుంటావా?!

Jul 18 2026 8:14 AM | Updated on Jul 18 2026 8:48 AM

Machilipatnam Woman Incident

కృష్ణాజిల్లా: కట్టుకున్న భర్త మరో మహిళతో ఉంటూ తనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడన్న కోపంతో భార్య తన కుటుంబ సభ్యులతో ఆ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన మచిలీపట్నంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బలరామునిపేటకు చెందిన శ్రీను అనే వ్యక్తికి అంజలితో వివాహం అయ్యింది. శ్రీను శ్లాబు పనులు చేస్తుంటాడు. అయితే ఐదేళ్ల క్రితం శ్రీను మీనాక్షి అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. 

కొంతకాలంగా ఆమెతోనే ఉంటూ మొదటి భార్యను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అంజలి శుక్రవారం రాత్రి తన బంధువులతో కలిసి మీనాక్షిని నడిరోడ్డుపై అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. ఆమెతో పాటు బంధువులు మీనాక్షిని మహిళ అని కూడా చూడకుండా మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నడిరోడ్డుపై ఆమె దుస్తులను చింపేసి తీవ్రంగా అవమానించారు. కొంత మంది మగాళ్లు కూడా మహిళ అని చూడకుండా మీనాక్షి జుట్టు పట్టుకుని ఈడ్చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. 

స్థానికులు పలువురు చికిత్స నిమిత్తం ఆమెను మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి సహకరించకపోవడంతో వైద్యుల సలహా మేరకు పోలీసులు తమ ప్రయత్నాన్ని ఉపసంహరించుకున్నారు. బాధితురాలు కోలుకున్న అనంతరం వివరాలు సేకరించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చిలకలపూడి పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement