దండెత్తిన మన్యం | uge rally in Paderu Mahadharna at ITDA | Sakshi
Sakshi News home page

దండెత్తిన మన్యం

Jul 18 2026 5:14 AM | Updated on Jul 18 2026 5:14 AM

uge rally in Paderu Mahadharna at ITDA

చంద్రబాబు సర్కారు తీరుపై అడవిబిడ్డల నిరసన గళం  

పాడేరులో భారీ ర్యాలీ.. ఐటీడీఏ వద్ద మహాధర్నా  

పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : చంద్రబాబు సర్కారు తీరుపై మన్యం దండెత్తింది. గిరిజనం కన్నెర్రచేశారు. ఆదివాసీ చట్టాల అమలు, చంద్రబాబు ఎన్నికల హామీలు అమలుచేయాలని నినదిస్తూ అడవిబిడ్డలు రణభేరి మోగించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఆదివాసీ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు, కంటెంట్‌ క్రియేటర్లు ఇచి్చన పిలుపు మేరకు పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. మహాధర్నా చేపట్టారు. జిల్లాలోని 11మండలాలతో పాటు అనకాపల్లి, పోలవరం, ఇతర జిల్లాల నుంచి వేలాదిమంది గిరిజనం తరలివచ్చారు. బాబు సర్కారుపై ధ్వజమెత్తారు.  

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన ర్యాలీ గోల్డ్‌షాప్స్‌ సెంటర్, మెయిన్‌ బజారు, పాత బస్టాండ్, సినిమా హాల్‌ సెంటర్‌ మీదుగా ఐటీడీఏ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ 1/70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. జీఓ నెంబర్‌.3 పునరుద్దరించాలని అరకు ఎన్నికల సభలో సీఎం చంద్రబాబు హామీలు తక్షణం నెరవేర్చాలని పట్టుబట్టారు.

జేసీ, ఐటీడీఏ పీవోను చుట్టుముట్టి నిరసన  
గిరిజనుల ధర్నా గురించి తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ ఐటీడీఏ వద్దకు చేరుకోవడంతో గిరిజనులు చుట్టుముట్టారు. సుమారు గంటపాటు జాయింట్‌ కలెక్టర్, ఐటీడీఏ పీఓను నిరసనకారులు రోడ్డుపైనే నిలబెట్టారు. ఈనెల 24న పోలవరం జిల్లాలో పర్యటన కంటే ముందు సీఎం చంద్రబాబు గిరిజనుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే మహోద్యమం చేపడతామని గిరిజనులు హెచ్చరించారు. 

ఆగస్టు 8, 9 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా మన్యం బంద్‌ చేపడతామని స్పష్టం చేశారు.  కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆందోళనలో అరకు ఎంపీ డాక్టర్‌ గుమ్మా తనూజరాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు పాల్గొని గిరిజన ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. మహాధర్నా కార్యక్రమానికి జిల్లా కేంద్రానికి తరలివస్తుండగా గిరిజనులను మండల కేంద్రాల్లో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే యత్నాలు చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా మండల కేంద్రాల్లో తిప్పకుండా సçగం వరకు డిపోకే పరిమితం చేశారు. అయినా వెరవకుండా భారీగా గిరిజనులు పాడేరు తరలిరావడంతో అధికారులు, పోలీసులు బిత్తరపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement