చిత్తూరు ఆర్వీఎస్ ఇన్స్టిట్యూట్కు 150 సీట్లు కేటాయింపు
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పిడుగురాళ్ల ప్రభుత్వ కాలేజీకి 100 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్మించాలని చూస్తున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడంపై వైఎస్సార్సీపీ హర్షం వ్యక్తం చేసింది. పిడుగురాళ్ల కాలేజీతో పాటు చిత్తూరులోని ఆర్వీఎస్ మెడికల్ కాలేజీ (ప్రైవేట్)కి 150 మెడికల్ సీట్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎంపీ గురుమూర్తి ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించారు. దీనిపై జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)తో సంప్రదించి కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్.. ఎంపీ గురుమూర్తికి లిఖిత పూర్వకంగా బదులిచ్చారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తాను ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించినట్లు ఎంపీ గురుమూర్తి తెలిపారు.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు, లోక్సభలో రూల్ 377 కింద మాట్లాడుతూ విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమ విజ్ఞప్తిపై పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు 100 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే వైఎస్ జగన్ ఆశయమన్నారు.


