
నెలవారీ క్రమానుగత పెట్టుబడులు (సిప్) వచ్చే 18–24 నెలల్లో రూ.40,000 కోట్లకు పెరగనున్నట్టు యూనియన్ ఏఎంసీ సీఈవో మధు నాయర్ అంచనా వేస్తున్నారు. ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల, క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతుండడం సిప్ పెట్టుబడులను ఇతోధికం చేస్తుందన్నది ఆయన విశ్లేషణ.
ఈ ఏడాది మార్చి నెలలో సిప్ రూపంలో ఈక్విటీ ఫండ్స్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.25,925 కోట్లుగా ఉంటే.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.24,113 కోట్లకు పెరగడం గమనార్హం. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇవి నెలవారీ రూ.16,602 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు 2024 మార్చి నాటికి ఉన్న రూ.10.71 లక్షల కోట్ల నుంచి 2025 మార్చి నాటికి రూ.13.31 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి.
బడ్జెట్లో ప్రకటించిన పన్ను ప్రయోజనాలు, మార్కెట్ విలువలు ఆకర్షణీయంగా మారడం సిప్ పెట్టుబడులను పెంచేందుకు సానుకూలిస్తాయని నాయర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు యూనియన్ మ్యూచువల్ ఫండ్ తన తాజా త్రైమాసికం నివేదికలో భారత ఈక్విటీ మార్కెట్లను ‘ఆకర్షణీయ జోన్’కు అప్గ్రేడ్ చేసింది. అంతకుముందున్న మోస్తరు ఖరీదు నుంచి మెరుగుపడడం గమనార్హం. ఇటీవలి స్టాక్స్ దిద్దుబాటుకు తోడు, కంపెనీల ఆదాయాలు కాస్త మెరుగుపడడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు..
దీర్ఘకాల పెట్టుబడులకు ఉన్న ప్రాధాన్యాన్ని మధు నాయర్ గుర్తు చేశారు. స్వల్పకాల ప్రభావాన్ని అతిగా ఊహించుకోవడం, దీర్ఘకాల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయడం ఇన్వెస్టర్లలో సాధారణంగా కనిపించేదిగా పేర్కొన్నారు. వచ్చే 10–15 ఏళ్ల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ, ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు చూపిస్తాయని భావిస్తున్నట్టు చెప్పారు.