ఎన్నికల వేళ సోషల్ మీడియా షాక్.. మెటా కీలక నిర్ణయం! | Meta will not recommend political content To Users On Instagram Threads | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ సోషల్ మీడియా షాక్.. మెటా కీలక నిర్ణయం!

Feb 10 2024 5:35 PM | Updated on Feb 10 2024 6:30 PM

Meta will not recommend political content To Users On Instagram Threads - Sakshi

ఎ‍న్నికల వేళ రాజకీయ నేతలకు సోషల్‌ మీడియా దిగ్గజం మెటా ( Meta ) షాకిచ్చింది. పొలిటికల్‌ కంటెంట్‌ను తమ ఇన్‌స్టాగ్రామ్ ( Instagram ), థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో రెకమెండ్‌ చేయబోమని ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్‌బుక్‌లో కూడా త్వరలో అవాంఛిత పొలిటికల్‌ కంటెంట్‌కి కళ్లెం వేస్తామంటోంది.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని అరికట్టడానికి ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ ఇప్పటికే కృషి చేస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాధనాలతో రూపొందించిన చిత్రాలను గుర్తించడానికి ఇటీవల ప్రయత్నాలను విస్తరించింది.  ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్‌ కంటెంట్‌ను రెకమెండ్‌ చేయబోమని ప్రకటిచింది.

 

అయితే రాజకీయ కంటెంట్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఇటువంటి ఇబ్బంది ఉండదని మెటా తెలిపింది.  అలాంటి కంటెంట్‌ను పోస్ట్ చేసే ఖాతాలను అనుసరించాలకుంటే తాము ఏ మాత్రం అడ్డు రాబోమని స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతి కావాలని తాము కోరుకుంటున్నాని, అందుకే ఫాలో కాని అకౌంట్ల నుంచి రాజకీయ కంటెంట్‌ను ముందస్తుగా సిఫార్సు మాత్రం చేయబోమని చెప్పింది. 

ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్‌ యాప్‌లలో రాజకీయ కంటెంట్ సిఫార్సులను చూడాలా వద్దా అన్నది పూర్తిగా యూజర్ల ఇష్టం. ఈ మేరకు ఎంపిక చేసుకోవడానికి అనుమతించే సెట్టింగ్‌లను మెటా తీసుకురాబోతోంది.  ఇదే విధమైన నియంత్రణ రాబోయే రోజుల్లో ఫేస్‌బుక్‌లో అమలు కానుంది. "రాజకీయ కంటెంట్‌ కావాలా వద్దా అన్న ఎంపిక యూజర్లకు కల్పించడమే మా లక్ష్యం. అదే సమయంలో ప్రతి ఒక్కరి ఆసక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది" అని ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌​ ఆడమ్ మోస్సేరి థ్రెడ్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

రాజకీయ నాయకుల సోషల్‌ మీడియా బలమైన వేదికగా ఉంది. తమ భావాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రధాన మీడియా కంటే సోషల్‌ మీడియానే అనువుగా మారింది. వీటిలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇకపై ఆయా ప్లాట్‌ఫామ్‌లలో పొలిటికల్‌ కంటెంట్‌ అవాంఛితంగా అందిరికీ చేరదు. పొలిటికల్‌ అకౌంట్లు, పేజీలు ఫాలో అవుతున్నవారికి మాత్రమే ఆ కంటెంట్‌ చేరుతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ మెటా తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ నాయకులకు గట్టి ఎదురుదెబ్బనే చెప్పాలి.

Advertisement
 
Advertisement
Advertisement