సాంకేతిక రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా.. భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరో వినూత్న సేవను అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారంగా పనిచేసే ‘జియో కాల్ ఏజెంట్’ అనే కొత్త వాయిస్ అసిస్టెంట్ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
ఫోన్ కాల్లో మాట్లాడుతూనే.. క్యాబ్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, మీటింగ్లను షెడ్యూల్ చేయడం వంటి పనులను ఈ ఏఐ అసిస్టెంట్ చేస్తుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆకాష్ అంబానీ వెల్లడించారు.
జియో కాల్ ఏజెంట్ను ప్రత్యేక యాప్గా కాకుండా నేరుగా జియో టెలికాం నెట్వర్క్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దీంతో వినియోగదారులు వేరే యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సర్వీస్ జియోకు చెందిన 50 కోట్లకు పైగా వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది భారతీయ భాషలకు కూడా మద్దతు ఇస్తుంది. దీంతో కేవలం ఇంగ్లిష్ తెలిసిన వారు మాత్రమే కాకుండా, ఇతరులు కూడా ఉపయోగించవచ్చు.
జియో కాల్ ఏజెంట్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, కాల్ మాట్లాడుతున్న 'హే జియో' అని చెప్పగానే.. ఏఐ అసిస్టెంట్ కాల్లో చేరుతుంది. సాధారణ చాట్బాట్లా కాకుండా, వ్యక్తిగత సహాయకుడిలా పని చేస్తూ వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు సహకరిస్తుంది.
ఈ ఏఐ అసిస్టెంట్ కాల్లో జరిగే సంభాషణను రియల్ టైమ్లో టెక్స్ట్ రూపంలోకి మార్చగలదు. కాన్ఫరెన్స్ కాల్లలో ఒకేసారి 10 మంది వరకు మాట్లాడినా వారి గొంతులను గుర్తించి, ఎవరు ఏమి మాట్లాడారో వేరు చేయగల సామర్థ్యం దీనికి ఉంటుంది. అంతేకాకుండా కాల్ ముగిసిన తర్వాత ముఖ్యాంశాలను సారాంశంగా తయారు చేయడం, చేయాల్సిన పనుల జాబితాను రూపొందించడం, రిమైండర్లు సృష్టించడం వంటి పనులను కూడా నిర్వహిస్తుంది.
అంతేకాదు.. కాల్ మధ్యలోనే కొన్ని లావాదేవీలను కూడా పూర్తి చేయగలదు. ఉదాహరణకు, రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, క్యాబ్ బుక్ చేయడం లేదా మీటింగ్ షెడ్యూల్ చేయడం వంటి పనులను కాల్ను నిలిపివేయకుండా ఈ ఏఐ అసిస్టెంట్ ద్వారా చేయవచ్చు. దీంతో వినియోగదారుల సమయం ఆదా అవుతుంది.
జియో కాల్ ఏజెంట్ ప్రారంభం.. వెనుక రిలయన్స్ సంస్థ పెద్ద లక్ష్యంతో ముందుకు సాగుతోంది. జనరేటివ్ ఏఐ సాంకేతికతను నేరుగా కోట్లాది వినియోగదారుల రోజువారీ జీవితాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సంస్థ ఈ సేవను రూపొందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఏఐ సేవలు ప్రత్యేక యాప్ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. కానీ జియో కాల్ ఏజెంట్ మాత్రం.. నెట్వర్క్ స్థాయిలోనే పనిచేస్తుంది.
ఏఐ మౌలిక వసతులు
ఇదే సమయంలో.. రిలయన్స్ కంపెనీ దేశంలో స్వదేశీ ఏఐ మౌలిక వసతుల నిర్మాణంపైనా దృష్టి సారిస్తోంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జామ్నగర్లో భారీ స్థాయి ఏఐ మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో తొలి 120 మెగావాట్ల దశను 2026 చివరి నాటికి ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తోంది.
అంతే కాకుండా.. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్వీడియా రూపొందించిన జీబీ300 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఈ మౌలిక వసతుల్లో వినియోగించనున్నారు. దీని ద్వారా భారతదేశంలోనే ఏఐ మోడళ్లను హోస్ట్ చేయడం, డేటాపై పూర్తి నియంత్రణ కల్పించడం, సంస్థల మేధో సంపత్తిని రక్షించడం వంటి ప్రయోజనాలు లభించనున్నాయి.
ఇదీ చదవండి: రిలయన్స్ జియో ఐపీఓ.. ముకేశ్ అంబానీ కీలక ప్రకటన!


