
క్విప్ ద్వారా ఇరెడా రూ.2,000 కోట్లు సేకరణ
అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు(క్విప్) ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ధి పీఎస్యూ.. ఇరెడా రూ. 2,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 5–10 మధ్య చేపట్టిన క్విప్నకు దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది. బీమా రంగ సంస్థలు, వాణిజ్య బ్యాంకులు, విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హతగల సంస్థాగత కొనుగోలుదారులు(క్విబ్) ఆసక్తి చూపినట్లు వెల్లడించింది.
ఇష్యూ ప్రాథమిక పరిమాణం రూ. 1,500 కోట్లుకాగా.. 1.3 రెట్లు అధికంగా రూ. 2,006 కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది. అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపును చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది. దీంతో షేరుకి రూ. 165.14 ధరలో 12.15 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది. రూ. 10 ముఖ విలువగల వీటిని రూ. 155.14 ప్రీమియంతో కేటాయిస్తున్నట్లు వివరించింది. ఫ్లోర్ ధర రూ. 173.83తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్లో రూ. 165.14 చొప్పున షేర్లను జారీ చేస్తున్నట్లు తెలియజేసింది.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్లకు వేగంగా ఆమోదం
క్విప్ నిధుల సమీకరణతో కంపెనీ టైర్–1 మూలధనంసహా కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) మరింత పటిష్టమైనట్లు పేర్కొంది. దేశీయంగా పునరుత్పాదక ఇంధన రంగ విస్తరణకు నిధులు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. 2023 నవంబర్లో ఐపీవో చేపట్టిన కంపెనీ తక్కువ సమయంలోనే క్విప్ను విజయవంతంగా నిర్వహించినట్లు ఇరెడా చైర్మన్, ఎండీ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు.