కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యుటివ్‌! | Infosys executive says companies will hire less employees in future | Sakshi
Sakshi News home page

కుండ బద్దలు కొట్టిన ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యుటివ్‌!

Mar 1 2024 8:45 AM | Updated on Mar 1 2024 12:52 PM

Infosys executive says companies will hire less employees in future - Sakshi

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. 2022లో ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీని (ChatGPT)ని పరిచయం చేసినప్పటి నుండి జనరేటివ్‌ ఏఐ (generative AI) పట్ల ఆసక్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుందని, వారి దైనందిన జీవితంలో వారికి సహాయపడుతుందని కొంతమంది భావిస్తుండగా, ఇది మానవ ఉద్యోగాలను తీసివేస్తుందని మరొక వర్గం అంటోంది. 

ఈ క్రమంలో దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు కఠోర విషయం చెప్పారు. జెనరేటివ్ ఏఐ.. సంస్థల్లో హెడ్ కౌంట్ తగ్గడానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. మరో మాటలో చెప్పాలంటే భవిష్యత్తులో కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులను నియమించుకుంటాయి.

ఇదీ చదవండి: ఇక నెలకు 11 రోజులు హాయి.. ఐటీ దిగ్గజం గుడ్‌న్యూస్‌!

బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ ప్రకారం.. జనరేటివ్ ఏఐ వంటి కొత్త టెక్నాలజీల వల్ల భవిష్యత్తులో కంపెనీలకు తక్కువ మంది ఉద్యోగులు అవసరమవుతారు. ఈ మార్పు వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో క్రమంగా జరుగుతుందని ఇన్ఫోసిస్‌ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, కో-హెడ్ (డెలివరీ) సతీష్ హెచ్‌సీ అన్నారు.

కంపెనీలు ఉత్పాదక ఏఐ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించినందున అవి మరింత సమర్థవంతంగా మారతాయని, సాంప్రదాయిక ఉద్యోగాల కోసం వారికి ఎక్కువ మంది అవసరం ఉండదని ఆయన వివరించారు.

రాయిటర్స్‌కి మరో ఇంటర్వ్యూలోనూ ఈ ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇదే విషయాన్నే వెల్లడించారు. తమ కంపెనీ "ఏఐ ఫస్ట్" గా మారుతోందని చెప్పారు.  "మొదట్లో ఇన్ఫోసిస్‌ డిజిటల్‌ ఫస్ట్‌ కాదు. దీనికి మాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు డిజిటల్‌కు ఎలా అలవాటు పడ్డామో అలాగే ఏఐకి కూడా మెరుగ్గా అలవాటు పడుతున్నాం. ఏఐ ఫస్ట్‌ అవుతున్నామని భావిస్తున్నాం" అని ఆయన పేర్కన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement