ముంబై: టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ‘యాక్సిడెంట్ సూపర్ గార్డ్ ప్లస్’ ప్లాన్ను ప్రవేశపెట్టింది. ప్రమాదాల్లో సమగ్ర ఆర్థిక రక్షణను అందించే వ్యక్తిగత ప్రమాద బీమా ప్లాన్ ఇదని, దేశంలో ఏటా ప్రమాదాల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. వ్యక్తుల ఆదాయం, అప్పులు, జీవనశైలి రిస్క్లకు అనుగుణంగా కవరేజీని ఎంపిక చేసుకోవచ్చు.
ప్రమాద మరణం, శాశ్వత పాక్షిక, పూర్తి వైకల్యంలో ఏక మొత్తంలో బీమా పరిహారం లభిస్తుంది. ప్రమాదాల కారణంగా అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అయ్యే ఖర్చులకు రీయింబర్స్మెంట్ పొందొచ్చు. లోన్ షీల్డ్ (రుణాల కోసం), ఈఎంఐ ప్రొటెక్షన్, పెట్కేర్ పేరుతో ఐచ్ఛిక కవరేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిపై వ్యక్తులు, కుటుంబ సభ్యులు ఈ ప్లాన్ను తీసుకోవచ్చు. వేతన జీవులకు ప్రీమియంలో అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.


