
గత ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ల ఎగుమతులు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇందులో రూ.1.5 లక్షల కోట్ల వాటా యాపిల్ ఐఫోన్లదే ఉన్నట్లు వివరించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 54 శాతం పెరిగినట్లు వివరించారు.
గత పదేళ్లలో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ అయిదు రెట్లు, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగినట్లు వైష్ణవ్ చెప్పారు. వివిధ పరికరాలు తయారు చేసే చిన్నా, పెద్ద సంస్థలన్నీ కలిపి 400 పైగా ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నట్లు వివరించారు. ఎల్రక్టానిక్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ను ఆయన ఆవిష్కరించారు. దీని కింద ఏప్రిల్ 1 నుంచి ఆరేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల లెక్కింపునకు 2024–25 ఆర్థిక సంవత్సరం బేస్ ఇయర్గా ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే
కన్జూమర్ ఎల్రక్టానిక్స్, మెడికల్ ఎల్రక్టానిక్స్, పవర్ ఎల్రక్టానిక్స్, ఆటోమొబైల్స్ తదితర ప్రతి టెక్నాలజీ ప్రోడక్టుల్లో ఉపయోగించే ఎల్రక్టానిక్ పరికరాలన్నింటికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. రెసిస్టర్లు, కెపాసిటర్లు, ఫెరైట్లు, స్పెషాలిటీ సెరామిక్స్, కాయిల్స్ మొదలైనవి ఈ జాబితాలో ఉంటాయి. టర్నోవరు ఆధారిత ప్రోత్సాహకాల కోసం కంపెనీలు రూ. 10 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రోత్సాహకాలు 1 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.