నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే | SEBI approved Aye Finance BlueStone Jewellery GK Energy Anthem Biosciences ipos | Sakshi
Sakshi News home page

నాలుగు ఐపీవోలకు సెబీ ఓకే

Apr 9 2025 8:11 AM | Updated on Apr 9 2025 8:11 AM

SEBI approved Aye Finance BlueStone Jewellery GK Energy Anthem Biosciences ipos

న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా సెకండరీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లు చవిచూస్తున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు కళకళలాడనున్నాయి. తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు 4 కంపెనీలను అనుమతించింది. జాబితాలో ఆంథమ్‌ బయోసైన్సెస్, ఆయే ఫైనాన్స్, బ్లూస్టోన్‌ జ్యువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్, జీకే ఎనర్జీ చేరాయి. 2024 డిసెంబర్‌లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన కంపెనీలు ఉమ్మడిగా రూ.6,345 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నాయి. వివరాలు చూద్దాం..

సీఆర్‌డీఎంవో..

కాంట్రాక్ట్‌ రీసెర్చ్, డెవలప్‌మెంట్, తయారీ సేవలందించే కంపెనీ(సీఆర్‌డీఎంవో) ఆంథమ్‌ బయోసైన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా రూ.3,395 కోట్ల విలువైన ఈక్విటీని ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో కంపెనీకికాకుండా ఇష్యూ నిధులు ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులకు అందనున్నాయి. బెంగళూరు కంపెనీ ప్రధానంగా క్లయింట్లకు టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల ఆధారిత సీఆర్‌డీఎం సర్వీసులు సమకూర్చుతోంది. ఔషధ డిస్కవరీ, అభివృద్ధి, తయారీ సంబంధిత సమీకృత కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఎన్‌బీఎఫ్‌సీ..  

బ్యాంకింగేతర ఫైనాన్స్‌ కంపెనీ ఆయే ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ.885 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు మరో రూ.565 కోట్ల విలువైన షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. తద్వారా రూ.1,450 కోట్లు సమీకరించనుంది. ఈక్విటీ నిధులను మూలధన పటిష్టతకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది.  

జ్యువెలరీ

బ్లూస్టోన్‌ బ్రాండుతో డైమండ్, గోల్డ్, ప్లాటినం ఆభరణాల తయారీ కంపెనీ బ్లూస్టోన్‌ జ్యువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ఐపీవోకు సిద్ధపడుతోంది. ఇందుకు వీలుగా రూ.1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2.4 కోట్ల షేర్లు ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. వీటిని కళారీ క్యాపిటల్‌ పార్ట్‌నర్స్‌ 2, సునీల్‌ కాంత్‌ ముంజాల్‌(హీరో ఎంటర్‌ప్రైజ్‌ భాగస్వామి), సామా క్యాపిటల్‌ 2 ఆఫర్‌ చేయనున్నాయి. ఈక్విటీ జారీ నిధుల్లో రూ.750 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది.  

అగ్రి పంప్స్‌

సోలార్‌ పవర్‌ ఆధారిత వ్యవసాయ వాటర్‌ పంప్‌ సిస్టమ్స్‌ అందించే జీకే ఎనర్జీ ఐపీవో చేపట్టనుంది. ఇష్యూలో భాగంగా రూ.500 కోట్ల విలువైన ఈక్విటీ తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్వి టీ జారీ నిధుల్లో రూ.422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలకు కేటాయించనుంది.


ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ రూ. 500 కోట్ల సమీకరణ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్, డిబెంచర్ల జారీ ద్వారా రూ. 500 కోట్ల వరకు సమీకరించనున్నట్లు వెల్లడించింది. వీటిపై కూపన్‌ రేటు వార్షికంగా 10.25 శాతం వరకు ఉంటుంది. ఈ నిధులను వ్యాపారరీత్యా క్లయింట్లకు రుణాలు ఇచ్చేందుకు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించుకోనుంది. ఈ ఇష్యూ ఏప్రిల్‌ 23న ము గుస్తుంది. 15 నెలల నుంచి 60 నెలల వరకు కాల వ్యవధులకు కంపెనీ ఈ డిబెంచర్లను జారీ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement