పశ్చిమాసియా యుద్ధం, అంతర్జాతీయ మార్కెట్లో మారుతున్న ముడిచమురు సమీకరణాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత రాకుండా చూసేందుకు, ఎగుమతిదారులు అనవసర లబ్ధి పొందకుండా అడ్డుకట్ట వేసేందుకు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పెంచింది. సవరించిన కొత్త ధరలు ఈరోజు నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన అధికారిక నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అయితే, సామాన్యుడిపై భారం పడకుండా దేశీయ వినియోగం కోసం సరఫరా అయ్యే పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి సుంకాలు పెంచకపోవడం గమనార్హం.
విండ్ఫాల్ ట్యాక్స్ అంటే..
ఏదైనా ఒక పరిశ్రమ లేదా కంపెనీ తమ సొంత కష్టం లేదా అదనపు పెట్టుబడి లేకుండా అనుకోకుండా మారిన అంతర్జాతీయ పరిస్థితులు లేదా బాహ్య కారణాల వల్ల భారీగా లాభ పడినప్పుడు (విండ్పాల్ గెయిన్స్) ఆ అదనపు లాభాలపై ప్రభుత్వం విధించే ప్రత్యేక పన్నునే విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు.
సవరించిన పన్నుల వివరాలు..
ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ మార్కెట్ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా కేంద్రం ఈ పన్నును సవరించింది.
| ఇంధనం రకం | పాత సుంకం (లీటరుకు) | సవరించిన కొత్త సుంకం (లీటరుకు) | మార్పు |
|---|---|---|---|
| డీజిల్ | రూ. 13.5 | రూ. 14.0 | రూ. 0.50 పెంపు |
| జెట్ ఇంధనం | రూ. 9.5 | రూ.12.5 | రూ.3 పెంపు |


