హ్యుందాయ్‌ క్రెటా ఈవీ వచ్చేస్తోంది! | Hyundai Motor India plans to launch EV models in 2025 | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ క్రెటా ఈవీ వచ్చేస్తోంది!

Jun 18 2024 4:28 AM | Updated on Jun 18 2024 8:01 AM

Hyundai Motor India plans to launch EV models in 2025

మార్చిలోగా రయ్‌ రయ్‌...

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా క్రెటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ను తీసుకొస్తోంది. 2025 జనవరి–మార్చి మధ్య ఈ మోడల్‌ దేశీ రోడ్లపై పరుగులు తీస్తుందని కంపెనీ ప్రకటించింది. ఒకసారి చార్జింగ్‌తో 550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యంతో క్రెటా ఈవీ రూపుదిద్దుకుంటోందని సమాచారం. ధర రూ. 22–26 లక్షల మధ్య ఉంటుంది.

 హ్యుందాయ్‌ ఇండియా పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. సెబీకి దాఖలు చేసిన పత్రాల ప్రకారం భారత్‌లో నాలుగు ఈవీలను ప్రవేశపెట్టాలన్నది సంస్థ ప్రణాళిక. వీటిలో మాస్‌ మార్కెట్‌ మోడల్‌తోపాటు హైఎండ్, ప్రీమియం ఈవీలు సైతం ఉన్నాయి. ఈవీ విభాగంలో కంపెనీ ప్రస్తుతం దేశంలో అయానిక్‌ 5, కోనా ఎలక్ట్రిక్‌ విక్రయిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 17.5 శాతం వాటా విక్రయించాలన్నది సంస్థ లక్ష్యం.

 తద్వారా రూ.25,000 కోట్లు సమీకరించనుంది.  దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్‌.. బ్యాటరీ ఈవీ, హైబ్రిడ్‌ ఈవీ, ప్లగ్‌–ఇన్‌ హైబ్రిడ్‌ ఈవీ, మైల్డ్‌ హైబ్రిడ్‌ ఈవీ, ఫ్యూయల్‌ సెల్‌ ఈవీలను తయారు చేస్తోంది.  ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వ్యాపారం కోసం కంపెనీ గతేడాది తమిళనాడులో రూ.20,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించింది. చెన్నై ప్లాంటును ఈవీలు, ఎస్‌యూవీల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement