
భారత్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఇదో వేడుక. మ్యాచ్లు జరిగినన్ని రోజులు నిత్యం వీటిపైనే చర్చ. అయితే ఈసారి ఐపీఎల్ ద్వారా బీసీసీఐకి ఎంత సంపద సమకూరిందోననే అనుమానం ఎప్పుడైనా వచ్చిందా? ఐపీఎల్ 2025లో బీసీసీఐకు మీడియా హక్కులు, ఇతర ప్రకటనలు వంటి వాటి ద్వారా ఎంత రాబడి వచ్చిందో తెలుసుకుందాం.
ఐపీఎల్ 2025 జూన్ 3న ముగిసింది. అహ్మదాబాద్లో జరిగిన ఫైనన్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటిసారి ఈ లీగ్ను గెలుచుకుంది. బీసీసీఐకి కీలకంగా మారిన ఐపీఎల్లో వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ప్రసార రుసుము ద్వారా రూ.9,678 కోట్లు అంటే ఒక్కో ఆటకు సుమారు రూ.130.7 కోట్లు రాబడి వచ్చినట్లు కొన్ని నివేదికలు తెలిపాయి. టెలివిజన్ హక్కుల నుంచి డిజిటల్ హక్కులను బీసీసీఐ వేరు చేయడంతో ఆదాయం మరింత పెరిగింది.
టెలివిజన్ హక్కులు స్టార్ స్పోర్ట్స్ వద్ద ఉండగా, డిజిటల్ హక్కులు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కు చెందిన వయాకామ్ 18 వద్ద ఉన్నాయి. వీటిని అదనంగా స్పాన్సర్షిప్ ఫీజు వస్తుంది. లీగ్ టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్. ఇది 2024 నుంచి 2028 వరకు ఐపీఎల్తో తన స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని రూ.2,500 కోట్లకు పొడిగించింది. అంటే 2025 సీజన్తో సహా ప్రతి సీజన్కు రూ.500 కోట్ల డీల్ కుదుర్చుకుంది.
ఇదీ చదవండి: ఐటీఆర్ గడువు తేదీ పొడిగింపు.. విస్తుగొలిపే కారణాలు
వీటితో పాటు అసోసియేట్ పార్టనర్స్ మై11సర్కిల్, ఏంజెల్ వన్, రూపే వంటి ఇతర స్పాన్సర్ల నుంచి కూడా బీసీసీఐ డబ్బు సంపాదించింది. స్ట్రాటజిక్ టైమ్ అవుట్ పార్టనర్ - సియెట్; అధికారిక అంపైర్ భాగస్వాములు - వండర్ సిమెంట్; ఆరెంజ్ & పర్పుల్ క్యాప్ పార్టనర్- ఆరామ్కో వంటి కంపెనీలు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. టిక్కెట్లు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయం బీసీసీఐకి అదనం. అయితే నిర్ణీత కేంద్ర ఆదాయ భాగస్వామ్య ప్రక్రియలో భాగంగా ఒక్కో జట్టుకు బీసీసీఐ రూ.425 కోట్లు ఇస్తుంది. 2024లో బీసీసీఐకి రూ.20,686 కోట్లు సమకూరాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.16,493 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది.