
అందరూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి అన్ని రకాలుగా సన్నద్ధులైన వేళ.. గవర్నమెంటు వారు రాతపూర్వకంగా గడువుతేదీని పొడిగించినట్లు సెలవిచ్చారు. ట్యాక్స్ ఆడిట్ కాని అన్ని కేసులకు గడువు తేదీ 2025 జులై 31. అన్ని ఫారాలను వరుసగా నోటిఫై చేశారు. నోటిఫై చేసిన తర్వాత తీరా రిటర్న్ ఫైల్ చేద్దామని వెళితే.. అంతా రెడీగా లేదు. అందరి ఉత్సాహం నీరుకారింది. అటు అసెస్సీలకు, ఇటు వృత్తి నిపుణులకు అసహనం, అనుమానం రెండూ ఏర్పడ్డాయి. అంతలోనే ఈ పొడిగింపు వార్త వచ్చింది. ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకు పొడిగించారంటే..
1. ఫారాలు నోటిఫై చేశారు కానీ అప్డేటెడ్ ఫారాలు చాలా లేటుగా వచ్చాయి.
2. ఫైలింగ్ చేయడానికి ఉండే యుటిలిటీలు రెడీగా లేవు.
3. ఇక్కడ చేయవలసింది పొడిగింపు కాదు. ఈ చర్య అనివార్యం కాదు. దానికి బదులుగా యుటిలిటీలను రెడీ చేయాల్సింది.
ఎన్నో విషయాలు చకచకా చేసే ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీన వైఖరి ఎందుకు అవలంబించిందో అంతుపట్టడం లేదు. గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి పొడిగింపు ఇవ్వకుండా/లేకుండా ఒక నిశ్చితమైన, నిర్దిష్టమైన వైఖరితో ఉంటూ ప్రభుత్వం ఒక మంచి సంప్రదాయాన్ని సృష్టించింది. అందరూ ఈ వైఖరిని మొదట్లో మెచ్చుకోక పోయినా, తర్వాత సర్దుకుని సద్దుమణిగారు. ఒక ముఖ్యమైన పని సకాలంలో జరిగిపోతుంది కదా అని సరదాపడ్డారు.
యుటిలిటీని ఎనేబుల్ చేసి, అసెస్సీలను ఆకట్టుకుంటే ఎంతో బాగుండేది. ఒక సత్సంప్రదాయాన్ని మూడోసారి ముచ్చటగా కొనసాగించిన ఘనత దక్కించుకునే పరిస్థితుల్లో.. ఏకంగా 45 రోజులు పొడిగించారు. కొంత మంది సంతోషపడ్డారు. మరికొందరు సంబరపడ్డారు.
కానీ పొడిగింపు అనేది పరిష్కారం కాదు. పని అలస్యం అవుతుందే తప్ప ఇంకేమీ ఉపయోగం లేదు. పొడిగింపు అనగానే అందరు అసెస్సీలు ఈ విషయాన్ని లైట్గా తీసుకుని పోస్ట్పోన్ చేస్తారు. ఆటోమేటిక్గా అన్నీ పోస్ట్పోన్ అయిపోతాయి. గత రెండు నెలల్లో చేయలేని యుటిలిటీలను ఎప్పుడు రెడీ చేస్తారు? ఎన్ని రోజుల్లో రెడీ చేస్తారు? డెవలప్మెంట్కి, ఇంటిగ్రేషన్కి, టెస్టింగ్కి వ్యవధి కావాలని సెంట్రల్ బోర్డ్ చెప్తోంది. అంటే వారికి నిర్దిష్టమైన ప్లాన్ ఉన్నా ఎప్పుడు రెడీగా ఉంటారో తెలియదన్నమాట.
సాధారణంగా మే 31 తర్వాత టీడీఎస్ స్టేట్మెంట్లలో అన్ని పద్దులు కనిపిస్తాయి. అవి ఆలస్యం అవుతాయి. ఒకవేళ కనిపించినా, సిస్టమ్స్ రెడీగా లేవు. ఇంకో సమస్య ఏమిటంటే, ట్యాక్స్ ఆడిట్కి గడువు తేదీ 2025 సెప్టెంబర్ 30. ఈ గడువు తేదీని కూడా పొడిగిస్తారా అనేదానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. వృత్తి నిపుణులు జులై 31 తర్వాత ట్యాక్స్ ఆడిట్ కేసులను చేపడతారు. ఇప్పుడు రెండు గడువు తేదీలకు పదిహేను రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీని వల్ల పని ఒత్తిడి. మానసిక ఒత్తిడి. టైం చాలకపోవడం.. తప్పులు దొర్లే అవకాశం.. ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇదీ చదవండి: సెబీ పేరుతో మోసాలు
ట్యాక్స్ ఆడిట్ కేసుల విషయంలో పొడిగింపు లేదు. విద్యార్థులు పరీక్షలు నిర్వహించే తేదీ పొడిగించగానే ముందు సంతోషిస్తారు. కానీ ఆ తర్వాత తెలుస్తుంది. నిజానికి ఆ పొడిగింపు వల్ల వారి శ్రమ రెట్టింపైందని. ఈ పొడిగింపు కూడా అలాంటిదే. గడిచిన సంవత్సరానికి సంబంధించిన సమాచారాన్ని ఎంత కాలం సేకరిస్తూ కూర్చుంటారు. తినగ తినగ వేము తియ్యనుండులాగా ఇదేమీ పరిపక్వతకు సంబంధించిన విషయం కాదు. నైపుణ్యాలు, నాణ్యత పెరగవు. కానీ మీరు మాత్రం రెడీగా ఉండక తప్పదు. యుటిలిటీలు రెడీ కాగానే ఫైల్ చేయండి. వారు అడుతున్న సమాచారం మీ చేతిలో ఉందని బలమైన నమ్మకంతో ఉండండి.
