
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.5–6.7 శాతం మేర వృద్ధిని నమోదు చేస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నప్పటికీ బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహయింపు చర్యలు దేశీ డిమాండ్కు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. అంతర్జాతీయంగా వాణిజ్య సంబంధాల్లో వస్తున్న మార్పులు, దేశీ వినియోగ డిమాండ్ పెంపు మధ్య ప్రభుత్వం ఎలా సమతూకాన్ని తీసుకొస్తుందన్న దానిపైనే 2025–26 వృద్ధి ఆధారపడి ఉంటుందని పేర్కొంది. రెండు వ్యతిరేక శక్తుల మధ్య ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి ఆధారపడి ఉంటుందని తెలిపింది.
అంతర్జాతీయ అనిశ్చితులు మన ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపిస్తాయి.. అదే సమయంలో పన్ను రాయితీలు దేశీ వినియోగాన్ని ఏ మేరకు పెంచుతాయో చూడాల్సి ఉందని పేర్కొంది. వీటి ఆధారంగా జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 6.7 శాతం మధ్య ఉండొచ్చని తెలిపింది. 2025–26 బడ్జెట్లో కేంద్రం రూ.లక్ష కోట్ల మేర పన్ను రాయితీలను ప్రకటించడం తెలిసిందే. మధ్యతరగతి కుటుంబాలకు దీంతో ప్రయోజనం చేకూరనుంది.
ఇదీ చదవండి: తగ్గిన మొండిబాకీలు.. పెరిగిన ఆదాయం
పన్ను రాయితీలతో యువత చేతుల్లో ఖర్చు చేసే మిగులు ఆదాయం పెరుగుతుందని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి ముజుందార్ తెలిపారు. అమెరికా ప్రతీకార సుంకాలను భారత్ ఎలా ఎదుర్కొంటుంది? ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో ఏ మేరకు పురోగతి సాధిస్తుందన్నది కీలకమన్నారు. ప్రతీకార సుంకాలతో భారత జీడీపీ 0.1–0.3 శాతం తగ్గిపోవచ్చని ముజుందార్ అభిప్రాయపడ్డారు. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్ కొత్త అవకాశాలను సొంతం చేసుకోగలదన్నారు.