
డిసెంబర్ త్రైమాసికంలో 9 శాతం డౌన్
విలువ పరంగా చూస్తే 3 శాతం తక్కువ
ట్రాన్స్యూనియన్ సిబిల్ నివేదిక
వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్లోనూ ఇదే తీరు
ముంబై: గృహ రుణాలు డిసెంబర్ త్రైమాసికంలో సంఖ్యా పరంగా చూస్తే 9 శాతం తగ్గాయి. విలువ పరంగా చూస్తే 3 శాతం క్షీణించినట్టు క్రెడిట్ బ్యూరో సంస్థ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వెల్లడించింది. ఎక్కువ రిస్క్తో కూడిన వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డుల్లోనూ రుణాల సంఖ్య తగ్గినట్టు తన తాజా నివేదికలో పేర్కొంది.
అన్ సెక్యూర్డ్ రుణాల విషయంలో దూకుడు తగ్గించి, నిదానంగా వెళ్లాలంటూ ఆర్బీఐ బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలను కొన్ని త్రైమాసికాలుగా సూచించడాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. అదే సమయంలో సెక్యూర్డ్ రుణ విభాగం, ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తూ, బ్యాంక్లకు కీలకంగా ఉన్న గృహరుణాల్లోనూ స్తబ్దత నెలకొనడాన్ని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.
గృహ రుణాల్లో బాకీలు (మొత్తంగా జారీ అయి, తిరిగి వసూలు కావాల్సిన మొత్తం) క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి 15 శాతంగా ఉంటే, అవి 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి 13 శాతానికి తగ్గినట్టు తెలిపింది. రుణ వితరణ పరంగా 2024 అక్టోబర్-డిసెంబర్ కాలం రెండేళ్లలోనే అతి తక్కువ డిమాండ్ను చూసినట్టు పేర్కొంది. మెట్రోల్లో రుణ విచారణలు తగ్గాయి.
చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాయి. మొదటిసారి రుణ గ్రహీతలు, ప్రధాన కస్టమర్ల (ఎన్టీసీ)కు రుణ వితరణ 2023 డిసెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంటే, 2024 డిసెంబర్ చివరికి 17 శాతానికి తగ్గింది. ఎన్టీసీ రుణ గ్రహీతల్లో 41 శాతం మంది జెనరేషన్ జెడ్ వారు (1995 తర్వాత జని్మంచిన వారు) కావడం గమనార్హం. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలను వీరు ఎక్కువగా తీసుకున్నారు.