
విస్తృత పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా సేల్స్, పార్ట్నర్షిప్ విభాగాలను పర్యవేక్షించే గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి గూగుల్ 200 మంది ఉద్యోగులను తొలగించింది. టీమ్ సహకారాన్ని పెంపొందించడానికి, కస్టమర్ సేవను మెరుగుపరచడానికి, క్రమబద్ధమైన కార్యకలాపాలను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇప్పటికే ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ వంటి కీలక ఉత్పత్తులను కలిగి ఉన్న గూగుల్ ప్లాట్ఫామ్ వివిధ విభాగాల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. మారుతున్న మార్కెట్ డిమాండ్లు, పరిశ్రమ ధోరణుల నేపథ్యంలో తాజా లేఆఫ్స్ను ప్రకటించినట్లు పేర్కొంది. గూగుల్ కృత్రిమ మేధ, డేటా సెంటర్ టెక్నాలజీల్లో భారీగా పెట్టుబడి పెడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెక్ కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయి. భవిష్యత్తు వృద్ధికి దోహదపడే సాంకేతిక పరిజ్ఞానాలకు అధికంగా ఖర్చు చేస్తున్నాయి. దాంతో ఉన్న ఉద్యోగులను ఆయా విభాగాలకు కేటాయిస్తున్నాయి.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలో 1,500 మందికి లేఆఫ్స్
ప్రముఖ కంపెనీల్లోనూ ఇదే ధోరణి
గూగుల్తోపాటు ప్రపంచవ్యాప్తంగా మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రముఖ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఇది పరిశ్రమ వ్యాప్తంగా ఉద్యోగుల పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో పోటీ పడేందుకు కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.