టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రానుంది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు సహాయకుడిగా ఉన్న గూగుల్ అసిస్టెంట్ మాయమైపోతుంది. దీని స్థానాన్ని జెమినీ ఏఐ భర్తీ చేయనుంది. సెప్టెంబర్ 4 నుంచి ఆండ్రాయిడ్ పరికరాల్లో గూగుల్ అసిస్టెంట్ సేవలను క్రమంగా తొలగించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
గూగుల్ తన వినియోగదారులకు పంపిన ఈమెయిల్లో, ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా అమలు చేస్తామని తెలిపింది. అంటే.. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని వారాల వ్యవధి పడుతుందని తెలుస్తోంది. స్మార్ట్ఫోన్లలో మాత్రమే కాకుండా.. ఆండ్రాయిడ్ టాబ్లెట్లు, స్మార్ట్వాచ్లు, హెడ్ఫోన్లు, అలాగే ఆండ్రాయిడ్ ఆటోకు కనెక్ట్ అయ్యే పరికరాల్లో కూడా గూగుల్ అసిస్టెంట్ సేవలు నిలిచిపోనున్నాయి.
నిజానికి.. గూగుల్ అసిస్టెంట్ను 2025 చివరి నాటికి పూర్తిగా తొలగించాలని కంపెనీ ముందుగా భావించింది. అయితే.. జెమినీకి మరిన్ని ఫీచర్లు జోడించేందుకు ఈ మార్పును కొంతకాలం వాయిదా వేసింది. ప్రస్తుతం జెమినీ అనేక కొత్త సామర్థ్యాలతో ముందుకు వచ్చినప్పటికీ, గూగుల్ అసిస్టెంట్లో ఉన్న కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులో లేవు.
గూగుల్ 2025 మార్చిలోనే అసిస్టెంట్ నుంచి జెమినీకి మార్పు గురించి ప్రకటించింది. భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ టెక్నాలజీనే కంప్యూటింగ్ రంగంలో కీలక మార్పు తీసుకురాబోతుందని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది వినియోగదారులు జెమినీని ఉపయోగించడం ప్రారంభించారని గూగుల్ తెలిపింది.
ఇటీవలి కాలంలో జెమినీ వినియోగం వేగంగా పెరిగింది. ఏఐ ఆధారిత సేవలపై ప్రజల ఆసక్తి పెరుగుతుండటంతో జెమినీకి వినియోగదారుల ఆదరణ కూడా పెరుగుతోంది. గతంలో గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్లు, రిమైండర్లు, సెర్చ్, స్మార్ట్ హోమ్ కంట్రోల్ వంటి పనులను నిర్వహించేది. ఇప్పుడు అదే స్థానాన్ని మరింత ఆధునికమైన ఏఐ సామర్థ్యాలతో జెమినీ భర్తీ చేయనుంది.


