భారత్లో పెట్టుబడులపరంగా పసిడికి ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ప్రస్తుతం దేశీయ బంగారం, ఆభరణాల రంగం కీలకమైన మార్పుల దశలోకి ప్రవేశిస్తోంది. మారుతున్న ప్రభుత్వ విధానాలు, నానాటికీ పెరుగుతున్న డిమాండ్, కస్టమర్ల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులు ఈ రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ధరలు చుక్కలనంటుతున్నా సరే.. పసిడిపై భారతీయుల మక్కువ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం.
ధరల భారం ఉన్నా.. తగ్గని డిమాండ్
సాధారణంగా ధరలు పెరిగితే డిమాండ్ తగ్గుతుందనేది మార్కెట్ సూత్రం. కానీ, బంగారం విషయంలో ఈ సూత్రం తలకిందులవుతోంది. గడిచిన కాలంలో పసిడి రేట్లు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా కొనుగోళ్లు పటిష్టంగానే కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్, పండుగలు మాత్రమే కాకుండా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా జనం బంగారాన్ని ఎంచుకుంటున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు కూడా ప్రస్తుత డిమాండ్కు ఊతమిస్తున్నాయి.
పారదర్శకతకే పెద్దపీట: కార్పొరేట్ బ్రాండ్ల హవా
ప్రస్తుత తరం కస్టమర్లు డిజైన్లతోపాటు స్వచ్ఛత, ధరల్లో పారదర్శకత, నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం హాల్మార్కింగ్ తప్పనిసరి కావడం మార్కెట్లో పెద్ద మార్పుకు కారణమైంది. నమ్మకమే పెట్టుబడిగా మారిన ప్రస్తుత తరుణంలో జ్యుయలరీ మార్కెట్ క్రమంగా కన్సాలిడేట్ అవుతోంది. అసంఘటిత రంగం నుంచి వ్యాపారం వేగంగా సంఘటిత రంగం వైపు మళ్లుతోంది.
గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా సంఘటిత రిటైల్ జ్యుయలరీ విభాగం ఊహించని రీతిలో విస్తరించింది. ప్రముఖ కార్పొరేట్ బ్రాండ్లు చిన్న నగరాలు, పట్టణాలకు సైతం తమ నెట్వర్క్ను పెంచుకుంటూ పోతున్నాయి.
పెట్టుబడులకు అనువైన కాలం
ఆర్థిక విశ్లేషకులు, మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో మధ్యకాలికంగా ఈ రంగం పెట్టుబడులకు ఎంతో అనువుగా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రముఖ జ్యుయలరీ కంపెనీల ఆదాయాలు, లాభాల వృద్ధి రేటు మెరుగ్గా ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరలకు దీర్ఘకాలంలో ఢోకా లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇదీ చదవండి: పెరుగుతున్న ధరలు.. నిర్మలా సీతారామన్ హెచ్చరిక!


