కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ఆధిపత్యం కోసం ప్రపంచ టెక్ దిగ్గజాలు చేస్తున్న విచ్చలవిడి వ్యయం, వారి ఆర్థిక మూలాలపై ఊహించని ప్రతికూల ప్రభావం చూపుతోంది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు ఏఐ మౌలిక సదుపాయాలు, అత్యాధునిక డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ చిప్లు, విద్యుత్ వనరుల కోసం మూలధన వ్యయాన్ని ఊహించని రీతిలో పెంచేస్తున్నాయి. అయితే, ఈ స్థాయిలో పెడుతున్న పెట్టుబడులకు తగ్గట్టుగా స్వల్పకాలంలో ఆదాయం సమకూరకపోవడంతో కంపెనీల ఫ్రీ క్యాష్ ఫ్లో వేగంగా తగ్గిపోతోంది.
ఆదాయానికి మించిన మూలధన వ్యయం
ప్రధాన కంపెనీ మొత్తం వార్షిక మూలధన వ్యయం 600- 650 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఇందులో దాదాపు 75 శాతం నిధులు నేరుగా ఏఐ మౌలిక వసతులకే కేటాయిస్తున్నారు. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో పెరుగుదల కంటే ఈ మూలధన వ్యయం వేగంగా పెరుగుతుండటంతో ఆర్థిక సమతుల్యత దెబ్బతింటోంది. అమెజాన్ వంటి సంస్థల ఎఫ్సీఎఫ్ ఇప్పటికే ప్రతికూల పరిధిలోకి వెళ్లగా ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ల మిగులు నగదు నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
అప్పుల వైపు బిగ్ టెక్ సంస్థలు
ఇంతకాలం రిజర్వుల్లో ఉన్న సొంత నిధులతోనే కార్యకలాపాలు సాగించిన బిగ్ టెక్ కంపెనీలు ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్లు, కార్పొరేట్ అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అపారమైన క్యాపెక్స్ అవసరాలను తీర్చుకోవడానికి బాండ్ల జారీ ద్వారా బిలియన్ల డాలర్ల రుణాలు సమీకరిస్తున్నాయి. దీంతో ప్రపంచ క్రెడిట్ మార్కెట్లలో టెక్ రంగం అత్యంత వేగంగా అప్పులు తీసుకుంటున్న విభాగంగా మారింది.
ఇన్వెస్టర్ల ఆందోళన
వాల్ స్ట్రీట్, గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఇప్పుడు ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ (ఆర్ఓఐ)పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ మోడళ్ల అభివృద్ధికి, శ్రమకు అవుతున్న నిరంతర వ్యయంతో పోలిస్తే వ్యాపార రాబడి నిమ్మదించడంతో షేర్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు పెరుగుతున్నాయి.
సుదీర్ఘకాలంలో ఏఐ అందించే విప్లవాత్మక మార్పులు, వ్యాపార అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టెక్ దిగ్గజాలు ఈ రిస్క్ తీసుకుంటున్నాయి. అయితే, స్వల్పకాలంలో ఈ పెట్టుబడులు లాభాలుగా మారకపోతే కంపెనీల వ్యాల్యుయేషన్లపై, క్రెడిట్ రేటింగ్లపై ఒత్తిడి తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: మళ్లీ టాప్ గేర్లోకి పసిడి.. నేటి ధరలు ఇలా..


