ఫార్మా జీసీసీలకు భారత్‌ హబ్‌! | Global pharmaceutical companies are establishing GCC in India | Sakshi
Sakshi News home page

ఫార్మా జీసీసీలకు భారత్‌ హబ్‌!

Apr 18 2025 5:40 AM | Updated on Apr 18 2025 7:58 AM

Global pharmaceutical companies are establishing GCC in India

రాజకీయ స్థిరత్వం, దేశీ వినియోగం దన్ను 

త్వరలో 100 బిలియన్‌ డాలర్లకు మొత్తం జీసీసీ మార్కెట్‌ 

2,500 కేంద్రాలకు విస్తరణ 

పరిశ్రమ వర్గాల అంచనా 

అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు భారత్‌లో తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. చాలా మటుకు ఎకానమీలు నెమ్మదిస్తున్న తరుణంలో దేశీయంగా రాజకీయ స్థిరత్వం, వినియోగం పటిష్టంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. 

ఇటీవలి ఎర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ నివేదిక ప్రకారం 2,500 పైచిలుకు సెంటర్లు, 45 లక్షలకు పైగా నిపుణులతో భారత్‌లో జీసీసీ మార్కెట్‌ పరిమాణం త్వరలో 100 బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించనుంది. ఇక లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్‌ (ఎల్‌ఎస్‌హెచ్‌సీ) సెగ్మెంట్లో 2024లో 100 సెంటర్లు ఉండగా 2030 నాటికి వీటి సంఖ్య 160కి చేరనుంది. వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుంది. భారత్‌లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్‌ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా, ఇక్కడి వర్ధమాన స్టార్టప్‌ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి.  

నియామకాల జోరు..  
డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్‌లోని తమ హబ్‌లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి సనోఫీ తమ సిబ్బంది సంఖ్యను 1,700 నుంచి 2,600కి పెంచుకునే యోచనలో ఉంది. అలాగే నోవో నార్డిస్క్‌ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను వార్షికంగా సుమారు 20 శాతం పెంచుకోవాలనే ప్రణాళికల్లో ఉంది.  మరోవైపు, టకెడా సంస్థ.. ఆసియాలోనే తమ తొలి ఇన్నోవేషన్‌ కేపబిలిటీ సెంటర్‌ను (ఐసీసీ) బెంగళూరులో ఏర్పాటు చేసింది. తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది.

 ఈ ఏడాది ఆఖరు నాటికి ఉద్యోగుల సంఖ్యను 770కి పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిబ్బంది సంఖ్య 340గా ఉంది. కొన్నాళ్లుగా భారత్‌లోని జీసీసీలు కేవలం ఖర్చులను ఆదా చేసే కేంద్రాలుగా మాత్రమే కాకుండా అదనపు విలువను కూడా జోడించగలిగే సామర్థ్యాలున్న సెంటర్లుగా ఎదుగుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్‌ పరివర్తన, అంతర్జాతీయ వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. నిర్వహణపరమైన మద్దతుతో పాటు ఆర్‌అండ్‌డీ, డేటా సైన్స్‌ వంటి అంశాల్లో అత్యుత్తమ హబ్‌లుగా మారుతున్నాయి. పలు గ్లోబల్‌ ఫార్మా కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నప్పటికీ, నిపుణులైన సిబ్బందిని అట్టే పెట్టుకోవడం సవాలుగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

పెద్ద సంఖ్యలో ఉద్యోగులు.. 
దిగ్గజ కంపెనీల జీసీసీల్లో నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. బెంగళూరులోని నోవో నార్డిస్క్‌ గ్లోబల్‌ బిజినెస్‌ సరీ్వసెస్‌ (జీబీఎస్‌) సెంటర్లో 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్‌ టీమ్‌కి ఇది తోడ్పాటు అందిస్తోంది. ఇక సనోఫీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు కీలక జీసీసీల్లో హైదరాబాద్‌ సెంటర్‌ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ నుంచి ఏఐ, డేటా అనలిటిక్స్, కొత్త టెక్నాలజీస్‌ వరకు వివిధ కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఎలై లిల్లీ సంస్థకు హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా జీసీసీలు ఉన్నాయి. ఈ రెండు సెంటర్లలో కలిపి 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు.  అమెరికా తర్వాత కంపెనీకి భారత్‌ అతి పెద్ద కేంద్రంగా ఉంటోంది.  

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement