Ernst & Young survey
-
ఫార్మా జీసీసీలకు భారత్ హబ్!
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు భారత్లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. చాలా మటుకు ఎకానమీలు నెమ్మదిస్తున్న తరుణంలో దేశీయంగా రాజకీయ స్థిరత్వం, వినియోగం పటిష్టంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవలి ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2,500 పైచిలుకు సెంటర్లు, 45 లక్షలకు పైగా నిపుణులతో భారత్లో జీసీసీ మార్కెట్ పరిమాణం త్వరలో 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించనుంది. ఇక లైఫ్ సైన్సెస్, హెల్త్కేర్ (ఎల్ఎస్హెచ్సీ) సెగ్మెంట్లో 2024లో 100 సెంటర్లు ఉండగా 2030 నాటికి వీటి సంఖ్య 160కి చేరనుంది. వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుంది. భారత్లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా, ఇక్కడి వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. నియామకాల జోరు.. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్లోని తమ హబ్లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి సనోఫీ తమ సిబ్బంది సంఖ్యను 1,700 నుంచి 2,600కి పెంచుకునే యోచనలో ఉంది. అలాగే నోవో నార్డిస్క్ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను వార్షికంగా సుమారు 20 శాతం పెంచుకోవాలనే ప్రణాళికల్లో ఉంది. మరోవైపు, టకెడా సంస్థ.. ఆసియాలోనే తమ తొలి ఇన్నోవేషన్ కేపబిలిటీ సెంటర్ను (ఐసీసీ) బెంగళూరులో ఏర్పాటు చేసింది. తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఉద్యోగుల సంఖ్యను 770కి పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిబ్బంది సంఖ్య 340గా ఉంది. కొన్నాళ్లుగా భారత్లోని జీసీసీలు కేవలం ఖర్చులను ఆదా చేసే కేంద్రాలుగా మాత్రమే కాకుండా అదనపు విలువను కూడా జోడించగలిగే సామర్థ్యాలున్న సెంటర్లుగా ఎదుగుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన, అంతర్జాతీయ వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. నిర్వహణపరమైన మద్దతుతో పాటు ఆర్అండ్డీ, డేటా సైన్స్ వంటి అంశాల్లో అత్యుత్తమ హబ్లుగా మారుతున్నాయి. పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నప్పటికీ, నిపుణులైన సిబ్బందిని అట్టే పెట్టుకోవడం సవాలుగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.పెద్ద సంఖ్యలో ఉద్యోగులు.. దిగ్గజ కంపెనీల జీసీసీల్లో నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. బెంగళూరులోని నోవో నార్డిస్క్ గ్లోబల్ బిజినెస్ సరీ్వసెస్ (జీబీఎస్) సెంటర్లో 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ టీమ్కి ఇది తోడ్పాటు అందిస్తోంది. ఇక సనోఫీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు కీలక జీసీసీల్లో హైదరాబాద్ సెంటర్ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ నుంచి ఏఐ, డేటా అనలిటిక్స్, కొత్త టెక్నాలజీస్ వరకు వివిధ కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఎలై లిల్లీ సంస్థకు హైదరాబాద్తో పాటు బెంగళూరులో కూడా జీసీసీలు ఉన్నాయి. ఈ రెండు సెంటర్లలో కలిపి 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత కంపెనీకి భారత్ అతి పెద్ద కేంద్రంగా ఉంటోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రూ.1,16,200 కోట్లకు వాహన విడిభాగాల విపణి
న్యూఢిల్లీ: వాహన విక్రయానంతర విడిభాగాల మార్కెట్ దేశీయంగా 2028 నాటికి రూ.1,16,200 కోట్లకు చేరుకుంటుందని ఒక నివేదిక వెల్లడించింది. వాహన విక్రయాల్లో భారీ వృద్ధి ఇందుకు కారణమని తెలిపింది. 2023లో ఇది రూ.83,000 కోట్లు ఉంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామ్యంతో ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ఈ నివేదిక రూపొందించింది. ‘ప్రస్తుతం భారతీయ రోడ్లపై 34 కోట్ల వాహనాలు పరుగెడుతున్నాయి. ఈ సంఖ్య వచ్చే అయిదేళ్లలో ఏటా వార్షిక సగటు వృద్ధి 8 శాతం నమోదు కానుంది. 2028 నాటికి ద్విచక్ర వాహనాలు 25.7 కోట్ల నుంచి 36.5 కోట్లకు, ప్యాసింజర్ వాహనాలు 4.7 కోట్ల నుంచి 7.2 కోట్లకు చేరనున్నాయి. ప్రీ–ఓన్డ్ కార్ల విక్రయాల సగటు వృద్ధి 2027–28 నాటికి ఏటా 17.5 శాతం ఉంటుంది. వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 1.9 కోట్లను తాకనుంది. ట్రాక్టర్లు 1.4 కోట్ల నుంచి 1.9 కోట్లకు చేరనున్నాయి. ఇక్కడి కంపెనీలకు టాప్–10 అంతర్జాతీయ మార్కెట్లకు రూ.2,90,500 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలు లభిస్తాయి. ఇంజన్, సస్పెన్షన్, బ్రేకింగ్, ట్రాన్స్మిషన్ పార్ట్స్, రబ్బర్ విడిభాగాలు, కూలింగ్ సిస్టమ్స్, ఫిల్టర్స్కు ప్రధానంగా డిమాండ్ ఉంటుంది’ అని నివేదిక వివరించింది. టైర్లు, లూబ్రికెంట్స్, కూలెంట్స్, బ్యాటరీలను నివేదికలో పొందుపర్చలేదు. -
ప్రైవేటు రుణాల్లో 12% వరకూ రాబడి!
న్యూఢిల్లీ: ప్రైవేటు రుణాల విషయంలో రాబడులు 12 శాతం వరకూ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విభాగంపై నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీలు), క్రెడిట్ ఫండ్స్ దృష్టి సారించే అవకాశం ఉందని కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) విశ్లేషించింది. ఈ నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో ఈ విభాగంలోకి 89 బిలియన్ డాలర్ల(రూ.6,67,500 కోట్లు) వరకూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు వెలువడిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ► వచ్చే ఐదేళ్లలో ఒత్తిడిలో ఉన్న ఆస్తులపై పెట్టుబడి అవకాశాలు, ఎన్పీఏల కొనుగోళ్లు, తాజా క్రెడిట్ డిఫాల్ట్లు అన్నీ పరిశీలిస్తే ప్రైవేటు రుణ అవకాశాల విలువ దాదాపు 25 బిలియన్ డాలర్లు. ► ప్రైవేట్ క్రెడిట్ పెట్టుబడిదారులకు భారత్ చక్కటి వ్యవస్థాగత అవకాశాన్ని అందిస్తుంది. మొండి బకాయిల సమస్య నేపథ్యంలో ఇబ్బందికరమైన పెట్టుబడులకు రుణ దాతలు దూరంగా ఉన్నారు. ► ఎన్బీఎఫ్సీలు 2018లో వాటిని చుట్టుముట్టిన లిక్విడిటీ సంక్షోభం నుండి ప్రస్తుతం కోలుకుంటున్నాయి. ► ప్రైవేట్ క్రెడిట్ వార్షికంగా సంవత్సరానికి 12–18 శాతం మధ్య అంతర్గత రాబడిని అందజేస్తుందని అంచనా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేటు రుణ పెట్టుబడి 39–89 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. ► ఒత్తిడితో కూడిన రుణ విభాగంపై సైతం ప్రైవేటు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. రాబడులు 18–24 శాతం వరకు ఉంటాయని భావించడమే దీనికి కారణం. ► స్థిర కరెన్సీ, అధిక ఆర్థిక వృద్ధి వంటి అంశాలు పెట్టుబడిదారు విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దీర్ఘకాలికంగా పెట్టుబడులపై 12 శాతం నుంచి 24 శాతం వరకూ రాబడి లభిస్తుందని అంచనా. ► వడ్డీరేట్లు మున్ముందు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం ప్రైవేటు రుణ ఇన్వెస్టర్లలో ఉంది. ఇంకా తగ్గించలేని కనిష్ట స్థాయిలో వడ్డీరేట్లు, కమోడిటీ ధరలు పుంజుకోవడం, ద్రవ్యోల్బణం ఆందోళనలు, రుణదాత హక్కుల అమల్లో జాప్యం నివారణకు ఇటీవలి చర్యలు వంటి అంశాలు దీనికి కారణం. ► అయితే ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ కొన్ని సవాళ్లనూ ఎదుర్కొంటోంది. అధికారిక దివాలా ప్రక్రియలో జాప్యం, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఫ్రేమ్వర్క్ వెలుపల తీర్మానాలలో జాప్యం, కార్పొరేట్ పాలన సమస్యలు, సర్ఫేసీ చట్టం వాస్తవ అమల్లో అడ్డంకులు వంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించదగినవి. ► ప్రైవేట్ క్రెడిట్ గొడుగు కింద జరిగే అనేక ఒప్పందాలు చోటుచేసుకుంటున్నాయి. దివాలా చట్టాల కింద ఒత్తిడికి గురైన వ్యాపారాన్ని కొనుగోలు చేయడం, వన్–టైమ్ సెటిల్మెంట్, అవకాశాలకు అనుగుణంగా లేదా ప్రత్యేక పరిస్థితుల లావాదేవీల వంటివి ఇందులో ఉన్నాయి. ► విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వంటి ఆఫ్షోర్ మార్గంలో లేదా ఏఐఎఫ్, ఎన్బీఎఫ్సీ, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు ద్వారా ఆన్షోర్ పెట్టుబడులు ద్వారా ప్రైవేటు రుణ మార్కెట్ మరింత విస్తరించే వీలుంది. -
కంపెనీలు లాభాలు పెంచి చూపిస్తాయ్
- అవినీతి విధానాలకు పాల్పడతాయ్ - ఎర్నస్ట్ అండ్ యంగ్ సర్వే న్యూఢిల్లీ: అధిక వృద్ధిని కనపర్చాల్సిన ఒత్తిడి కారణంగా చాలా మటుకు కంపెనీలు లాభాలు పెంచి చూపడం, అవినీతి విధానాలకు పాల్పడటం వంటివి చేస్తున్నాయని దేశీయంగా అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు భావిస్తున్నారు. అలాగే, వ్యాపారాలకు సంబంధించి లంచాలివ్వడం, అవినీతికి పాల్పడటం మొదలైనవి సర్వసాధారణమని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ ఈవై(ఎర్నస్ట్ అండ్ యంగ్)నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది ఈ విధమైన అభిప్రాయాలు వెల్లడించారు. కంపెనీలు తమ పనితీరును ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తుంటాయని, ఇందుకోసం అవి ఆర్థిక ఫలితాల్లో అవకతవకలకు పాల్పడుతుంటాయని 40% మంది భావిస్తున్నట్లు ఈవై పేర్కొంది. అనేక సవాళ్లతో కూడిన పరిస్థితుల నడుమ కంపెనీలు నడుస్తున్నాయని, వ్యాపారంలో వృద్ధి కనపర్చేందుకు కొంగొత్త ఆదాయ మార్గాలు అన్వేషించడం కోసం యాజమాన్యంపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని వివరించింది. నైతికతపై పెరుగుతున్న అవగాహన .. వ్యాపారాల్లో నైతిక విలువల గురించి అవగాహన పెరుగుతోన్నట్లు సర్వే ద్వారా వెల్లడైందని ఈవై పార్ట్నర్ అర్పిందర్ సింగ్ తెలిపారు. నియంత్రణ సంస్థలు మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితులు మారుతున్నాయని, ఇది భారతీయ వ్యాపారాలపై సానుకూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. సర్వే ప్రకారం.. భారత్ ఊహించిన దానికంటే తక్కువ ఆర్థిక వృద్ధి సాధిస్తోందని 67 శాతం మంది భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీలు నైతిక నియమావళికి కట్టుబడి ఉండాలంటే మరింత కసరత్తు చేయాల్సి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొంగొత్త ఆదాయ అవకాశాలను అన్వేషించాలంటూ మేనేజర్లపై తీవ్ర ఒత్తిడి ఉంటోందని 81 శాతం మంది తెలిపారు. అధిక రిస్కులున్న మార్కెట్లలోకి ప్రవేశించాలంటూ ఒత్తిడి పెరుగుతోందని 66 శాతం మంది పేర్కొన్నారు. కంపెనీలు వ్యక్తిగత బహుమతులు, నగదు చెల్లింపులు ఇవ్వడం లేదా వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం సాధారణమేనని 59 శాతం మంది ఉద్యోగులు చెప్పారు. భారత్తో పాటు యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని మొత్తం 38 దేశాల్లో ఈవై ఈ సర్వే నిర్వహించింది. సుమారు 3,800 మంది ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు.