ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా గుర్తింపు పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త 'ఎలాన్ మస్క్'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మస్క్ విజయాన్ని కేవలం సంపదతో కొలవలేమని, అసలు విజయ రహస్యం ఆయన ఆత్మవిశ్వాసం, పట్టుదలలోనే ఉందని పేర్కొన్నారు.
స్పేస్ఎక్స్ లిస్టింగ్తో మస్క్ సంపద భారీగా పెరిగి ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంది. ఈరోజు అందరూ ట్రిలియన్ డాలర్ల మైలురాయి గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు కథ ఏమిటంటే.. ఈ రోజు అసాధ్యం అనుకున్నది రేపు సాధ్యమవుతుందని మస్క్ గట్టిగా విశ్వసిస్తారని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
మస్క్ ప్రస్తుతం టెస్లా, స్టార్లింక్ వంటి సంస్థల ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టకాలాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా 2018లో మస్క్ ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నానని వెల్లడించారు. ఆ సమయంలో చాలామంది విమర్శించినప్పటికీ, ఆనంద్ మహీంద్ర మాత్రం ఆయనకు మద్దతు ప్రకటించారు.
అప్పట్లో సోషల్ మీడియా వేదికగా మస్క్ను ఉద్దేశించి 'ధైర్యంగా ముందుకు సాగండి. ప్రపంచానికి మీలాంటి స్ఫూర్తిదాయక ఆవిష్కర్తలు అవసరం' అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆ సమయంలో మస్క్ చూపిన సహనం, సంకల్పమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఆనంద్ మహీంద్రా అభిప్రాయం ప్రకారం.. నిజమైన ఆవిష్కర్తలను వారి విజయ సమయాల్లో కాకుండా కష్టకాలంలో వారు ఎలా నిలబడతారనే అంశం ఆధారంగా అంచనా వేయాలి. ఎలాన్ మస్క్ కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాలపై నమ్మకం కోల్పోకుండా ముందుకు సాగడం వల్లే నేడు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: కియోసాకి హెచ్చరిక.. బంగారం ధరల పెరుగుదల స్టార్ట్!


