
దేశంలో హై-ఎండ్ ఇళ్లకు ఏ మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ధర ఎన్ని రూ.కోట్లయినా తగ్గేదే లేదంటున్నారు కొనుగోలుదారులు. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం డీఎల్ఎఫ్ లిమిటెడ్ తన సరికొత్త లగ్జరీ రెసిడెన్షియల్ వెంచర్ ప్రివానా నార్త్లోని ఫ్లాట్లన్నీ కేవలం ఏడు రోజుల్లోనే పూర్తిగా అమ్మేసింది. గురుగ్రామ్లో 116 ఎకరాల సువిశాల టౌన్షిప్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ రూ .11,000 కోట్లకు పైగా అమ్మకాలను సాధించింది. ఇది దేశంలోని పెద్ద నగరాల్లో ప్రీమియం గృహాలకు ఉన్న బలమైన మార్కెట్ డిమాండ్ను తెలియజేస్తోంది.
గురుగ్రామ్లోని 76, 77 సెక్టార్లలో 17.7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ప్రివానా నార్త్ లో ఆరు ఎత్తైన 50 అంతస్తుల నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటి వరకు డీఎల్ఎఫ్ అభివృద్ధి చేసిన అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ టవర్లు ఇవే. 1,152 నాలుగు పడక గదుల అపార్ట్మెంట్లు, డజను లగ్జరీ పెంట్ హౌస్లు ఉన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో ఫ్లాట్ ధర రూ.9.5 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంది.
👉ఇది చదివారా? హైదరాబాద్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ లోడింగ్
డీఎల్ఎఫ్ గత లగ్జరీ లాంచ్లలో కనిపించిన విజయాన్ని ప్రతిబింబిస్తూ దేశీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఈ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ గతంలో లాంచ్ చేసిన ప్రివానా సౌత్, ప్రివానా వెస్ట్ ప్రాజెక్ట్లలో సైతం ఇలాగే వేగంగా అమ్మకాలు నమోదయ్యాయి. హై-ఎండ్ నివాసాలకు ఉన్న డిమాండ్, డీఎల్ఎఫ్ నివాస ప్రాజెక్టులపై కొనుగోలుదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రతిస్పందనకు కారణమని కంపెనీ నాయకత్వం పేర్కొంది.
ప్రివానా నార్త్ వేగవంతమైన అమ్మకాలు హై-ఎండ్ గృహాల పట్ల విస్తృత ధోరణిని హైలైట్ చేస్తాయి. 2025 తొలి త్రైమాసికంలో రూ.4 కోట్లకు పైబడిన ఇళ్ల అమ్మకాలు 28 శాతం పెరిగాయని, ఇందులో ఢిల్లీ-ఎన్సీఆర్ వాటా సింహభాగం ఉందని సీబీఆర్ఈ తెలిపింది. 2025 ఆర్థిక సంవత్సరంలో డీఎల్ఎఫ్ రికార్డు స్థాయిలో రూ.21,223 కోట్ల ప్రీ సేల్స్ సాధించింది. భవిష్యత్తులో గురుగ్రామ్, ముంబై, గోవాలలో లాంచ్ చేసే ప్రాజెక్టులకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని కంపెనీ ఆశిస్తోంది.