హైదరాబాద్‌లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ లోడింగ్‌ | Real estate in Hyderabad sees dip in carpet area of apartments as loading rises | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ లోడింగ్‌

Jun 15 2025 5:04 PM | Updated on Jun 15 2025 5:29 PM

Real estate in Hyderabad sees dip in carpet area of apartments as loading rises

నివాస విభాగాన్ని కరోనా కంటే ముందు, ఆ తర్వాత అని విభజించే పరిస్థితులు వచ్చాయి. కోవిడ్‌ కంటే ముందు వరకూ అపార్ట్‌మెంట్‌ విస్తీర్ణంలో కార్పెట్‌ ఏరియాకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అంటే ఫ్లాట్‌ ఏరియాలో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం ఎంత ఉందని చూసుకునేవారు. కానీ, కోవిడ్‌ తర్వాత నుంచి కొనుగోలుదారుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. ఫ్లాట్‌లో నివాసితుడు వినియోగించే స్థలం కంటే క్లబ్‌హౌస్, పార్క్, గార్డెన్, లాబీ వంటి వసతులకు ఎంత స్థలం కేటాయిస్తున్నారనే దానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. లగ్జరీ లైఫ్‌ స్టయిల్‌ను కోరుకునే యువ జనరేషన్‌ పెరుగుతుండటంతో అపార్ట్‌మెంట్‌లో కార్పెట్‌ ఏరియా క్రమంగా తగ్గుతోందని అనరాక్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది.      – సాక్షి, సిటీబ్యూరో

అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో ఫ్లాట్ల స్థలంతో పాటు లిఫ్ట్, మెట్లు, క్లబ్‌హౌస్, పార్క్‌ ఇతరత్రా వసతుల కోసం కేటాయించిన స్థలాన్ని కూడా కలిపితే దాన్ని సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా పేర్కొంటారు. ఇక, ఫ్లాట్‌లో వాస్తవంగా గృహ యజమాని వినియోగించే స్థలం(గోడ నుంచి గోడ వరకూ ఉండే స్పేస్‌)ను కార్పెట్‌ ఏరియాగా పేర్కొంటారు. కరోనా మహమ్మారి కంటే ముందు వరకూ గృహ కొనుగోలుదారులు కార్పెట్‌ ఏరియాకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. కోవిడ్‌ తర్వాత నుంచి కార్పెట్‌ కంటే అపార్ట్‌మెంట్‌లోని వసతులకు(లోడింగ్‌) ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1) నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అపార్ట్‌మెంట్‌ లోడింగ్‌ 40 శాతానికి చేరుకుంది. 2019లో ఇది 31 శాతంగా ఉంది. నివాస సముదాయాలలో అధునిక వసతులు, సౌకర్యాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రధాన నగరాలలో అపార్ట్‌మెంట్ల లోడింగ్‌(వసతులు)పెరుగుతోంది. విలాసవంతమైన జీవనశైలి కారణంగా గృహ కొనుగోలుదారులు అధిక వసతులు, సౌకర్యాలను కోరుతున్నారు.

వసతులకు ప్రాధాన్యం 
దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో అపార్ట్‌మెంట్లలోని మొత్తం స్థలంలో 60 శాతం నివాసయోగ్యమైన స్థలం కాగా మిగిలిన 40 శాతం సాధారణ ప్రాంతం. లిఫ్ట్, లాబీ, మెట్లు, క్లబ్‌ హౌస్, వసతులు, ట్రెరస్‌ వంటి కామన్‌ ఏరియాలు. కరోనా కంటే ముందు వరకూ 30 శాతం కంటే తక్కువ లోడింగ్‌ సాధారణంగా భావించేవారు. కానీ, కరోనా తర్వాతి నుంచి విలాసవంతమైన జీవనశైలి అలవాటైపోయింది. ప్రాజెక్ట్‌ చిన్నదైనా, పెద్దదైనా ఆధునిక వసతులు ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్‌మెంట్లలో నివాసయోగ్యమైన స్థలం కార్పెట్‌ ఏరియా తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు ప్రాథమిక జీవనశైలి సౌకర్యాలతో సంతృప్తి చెందడం లేదు. ఫిట్‌నెస్‌ కేంద్రాలు, క్లబ్‌ హౌస్, పార్క్, గార్డెన్, గ్రాండ్‌ లాబీలు ఉండాలని కోరుకుంటున్నారు.

రీసేల్‌ విలువ పెరుగుదల.. 
లోడింగ్‌ పెరిగితే కమ్యూనిటీ నివాస యోగ్యత, రీసేల్‌ విలువలను కూడా పెరుగుతుంది. అయితే గృహ కొనుగోలుదారులు తమ అపార్ట్‌మెంట్లలో వాస్తవంగా ఉపయోగించే స్థలాన్ని కోల్పోతారు. ప్రతి ప్రాజెక్ట్‌లో అపార్ట్‌మెంట్‌లోని మొత్తం స్థలంలో గృహ కొనుగోలుదారులు వాస్తవంగా ఉపయోగించే స్థలం, సౌకర్యాల కోసం కస్టమర్లు ఎంత చెల్లిస్తున్నారో స్పష్టంగా పేర్కొనేలా రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) నిబంధనలు రూపొందించాలి. దీంతో కస్టమర్లు చెల్లించే సొమ్ములో దేనికెంత వ్యయం అవుతుందో స్పష్టత ఉంటుంది.

లోడింగ్‌ శాతాన్ని ఎలా లెక్కిస్తారంటే.. 
సూపర్‌ బిల్టప్‌ ఏరియా నుంచి కార్పెట్‌ ఏరియాను తీసి వేసి, కార్పెట్‌ ఏరియాతో భాగించాలి. వచ్చిన ఫలితాన్ని వందతో గుణిస్తే వచ్చేదే లోడింగ్‌ శాతం. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో మీరు 1,500 చ.అ. అపార్ట్‌మెంట్‌ కొంటున్నారని అనుకుందాం. ఇందులో ఫ్లాట్‌లో కస్టమర్‌ వినియోగించే స్థలం 750 చ.అ.లే ఉంటుంది. మిగిలిన స్థలం లిఫ్టు, లాబీ, మెట్లు, క్లబ్‌ హౌస్‌ వంటి కామన్‌ ఏరియాలు ఉంటాయి. అంటే ఫ్లాట్‌ ఖరీదులో కస్టమర్‌ వాస్తవంగా వినియోగించే కార్పెట్‌ ఏరియాతో పాటు కామన్‌ ఏరియా కూడా కలిపే ఉంటుందన్నమాట.

 

నగరంలో లోడింగ్‌ 38 శాతం..
హైదరాబాద్‌లో లోడింగ్‌(వసతులు) శాతం 2019లో 30 శాతంగా ఉండగా.. 2022 నాటికి 33కు, ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 38 శాతానికి పెరిగింది. 2025 క్యూ1 నాటికి దేశంలోని ప్రధాన నగరాలలో అత్యధికంగా 43 శాతం లోడింగ్‌తో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2019లోనూ ఈ ఆర్థిక నగరంలో అత్యధిక లోడింగ్‌ 33 శాతంతో టాప్‌లో నిలిచింది. అత్యల్పంగా 36 శాతం లోడింగ్‌తో చెన్నై చివరి స్థానంలో నిలిచింది. 2019లో ఇక్కడ లోడింగ్‌ 30 శాతంగా ఉంది. ఏటేటా బెంగళూరులో అపార్ట్‌మెంట్‌ లోడింగ్‌ క్రమంగా పెరుగుతోంది. 2019లో ఇక్కడ 30 శాతం లోడింగ్‌ ఉండగా.. 2025 క్యూ1 నాటికి ఏకంగా 41 శాతానికి పెరిగింది. 2022లో ఇది 35 శాతంగా ఉంది. గత ఏడేళ్లలో బెంగళూరులో సగటు లోడింగ్‌ అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఉంది. ఎన్‌సీఆర్‌ లో 2019లో లోడింగ్‌ శాతం 31 శాతం నుంచి 2025 క్యూ1 నాటికి 41 శాతానికి చేరింది. పుణేలో 32 శాతం నుంచి 40కు, కోల్‌కతాలో 30 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement