ఢిల్లీ ప్రభుత్వం 'ఢిల్లీ ఈవీ పాలసీ 2026'ను అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది. ఇది భారత్లో ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహానికి తీసుకున్న అన్ని చర్యలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. దీని ప్రధాన లక్ష్యం అంతర్గత దహన ఇంజిన్ (పెట్రోల్, డీజిల్, సీఎన్జీ) వాహనాలను దశలవారీగా తగ్గించి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం.
ఈ పాలసీకి ప్రభుత్వం సుమారు రూ.7,000 కోట్ల బడ్జెట్ కేటాయించింది. దీని ద్వారా వినియోగదారులు ఈవీలను కొంత తక్కువ ఖర్చుతో కొనుగోలు చేయవచ్చు.
పాలసీ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్పై 100 శాతం మినహాయింపు లభిస్తుంది. అయితే.. ఈ ప్రయోజనం రూ.30 లక్షల లోపు ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అంటే లగ్జరీ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే సాధారణ పన్నులు చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
ప్రభుత్వం నేరుగా కొనుగోలుదారులకు సబ్సిడీ కూడా అందిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ టూవీలర్లకు రూ.30,000 వరకు, త్రీ-వీలర్లకు రూ.50,000 వరకు, అలాగే చిన్న ఎలక్ట్రిక్ ట్రక్కులకు రూ.1,00,000 వరకు సహాయం అందుతుంది.
ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.. ICE వాహనాలపై దశలవారీ నిషేధం. ఇందులో భాగంగానే 2027 జనవరి 1 నుంచి ఆటో రిక్షాలు, చిన్న సరకు రవాణా చేసే వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపివేయనున్నారు. 2028 ఏప్రిల్ 1 నుంచి ఢిల్లీలో కొత్త పెట్రోల్, డీజిల్, సీఎన్జీ టూవీలర్ల రిజిస్ట్రేషన్ పూర్తిగా రద్దు చేస్తారు. కాబట్టి రానున్న రోజుల్లో ఢిల్లీలో రోడ్డుపై కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కనిపించే అవకాశం ఉంది.
పాత వాహనాలను స్క్రాప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. నాలుగు చక్రాల వాహనాలకు రూ.1,00,000, టూవీలర్లకు రూ.10,000, త్రీ వీలర్లకు రూ.25,000 వరకు ప్రోత్సాహం ఇవ్వబడుతుంది.
పెద్ద సరకు రవాణా వాహనాల కోసం ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ ట్రక్కులకు కొన్ని నగర ప్రవేశ ఆంక్షల నుంచి మినహాయింపు లభిస్తుంది. అంతే కాకుండా పాఠశాల వాహనాలను కూడా దశలవారీగా ఈవీలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఎలక్ట్రిక్ వాహనాలను పెంచడం మాత్రమే కాకుండా.. చార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి చేయడానికి కూడా ప్రభుత్వం కావలసిన ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగానే.. ఢిల్లీ అంతటా 30,000కు పైగా చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీని ద్వారా EV వినియోగదారులకు ఛార్జింగ్ సమస్య తగ్గే అవకాశం ఉంది.
The Delhi Cabinet has approved the new Delhi EV Policy 2026, a landmark initiative to curb vehicular pollution and accelerate the transition towards clean, sustainable mobility in the national capital.
The policy will come into effect on 1 July 2026 and remain in force until 31… pic.twitter.com/mDvXdhVHTN— CMO Delhi (@CMODelhi) June 29, 2026


