ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్‌లో జాబ్! | Rejected Twice And Chased Her Dream Again, Chennai Woman Finally Joins Cognizant After 4-Year Wait, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఆ రాత్రంతా ఏడ్చాను.. చివరకు కాగ్నిజెంట్‌లో జాబ్!

Jun 17 2026 3:47 PM | Updated on Jun 17 2026 4:25 PM

Cried The Whole Night and I Get Cognizant Job After 2 Rejections in 4 Years

ప్రతి విజయం వెనుక ఎన్నో కష్టాలు, నిరాశలు, తిరస్కరణలు దాగి ఉంటాయి. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. తప్పకుండా సక్సెస్ వస్తుందని అంటారు చెన్నైకు చెందిన మహేశ్వరి మోహన్. ఇంతకీ ఈమె ఎవరు?, ఈమె సక్సెస్ జర్నీ ఏమిటనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

మహేశ్వరి మోహన్‌ చదువుకునే రోజుల్లోనే కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేయాలని కలలు కనింది. 2022లో తన కాలేజీ క్యాంపస్ డ్రైవ్ సమయంలో కాగ్నిజెంట్ తనను మొదటిసారి తిరస్కరించింది. కలలు కన్న కంపెనీ రిజెక్ట్ చేయడంతో 'ఆ రాత్రంతా నేను ఏడ్చాను' అని ఆమె తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.

కాగ్నిజెంట్ కంపెనీ రిజెక్ట్ చేసిందని, మహేశ్వరి అక్కడితో ఆగిపోలేదు. మరోసారి 2023 జూన్‌లో జరిగిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరై మళ్లీ చివరి రౌండ్ వరకు చేరుకున్నారు. కానీ మరోసారి తిరస్కరణ ఎదురైంది. దీంతో ఆమె తనను తాను ప్రశ్నించుకుంది, తనకు కాగ్నిజెంట్‌లో పనిచేయడానికి కావాల్సిన సామర్థ్యం లేదని భావించింది.

అలాంటి సమయంలో.. 2023 నవంబర్‌లో హెచ్‌సీఎల్‌టెక్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. అక్కడ పనిచేయడమే తన కెరీర్‌లో ఒక కీలక మలుపుగా మారిందని మహేశ్వరి చెప్పారు. సంస్థలో కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నారు, అనుభవం సంపాదించారు, వృత్తిపరంగా ఎంతో ఎదిగారు. అయినప్పటికీ కాగ్నిజెంట్‌లో చేరాలనే కోరిక మాత్రం ఆమె మనసులో అలాగే ఉండిపోయింది.

ఇదిలా ఉండగా.. 2026 ఏప్రిల్‌లో అనుకోకుండా కాగ్నిజెంట్ రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. రియల్ టైమ్ అనలిస్ట్ (RTA) పోస్టుకు అవకాశం ఉందని తెలియజేశారు. ఈసారి మహేశ్వరి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. అన్ని ఇంటర్వ్యూ రౌండ్లను విజయవంతంగా పూర్తి చేసి ఎంపికయ్యారు. చివరకు 2026 జూన్‌లో కాగ్నిజెంట్‌లో చేరి తన నాలుగేళ్ల కలను సాకారం చేసుకున్నారు.

తన విజయాన్ని వివరిస్తూ ఆమె ''2022లో ఫ్రెషర్‌గా ఉన్నప్పటికంటే.. ఇప్పుడు నేను పది రెట్లు ఎక్కువగా సిద్ధంగా ఉన్నాను'' అని చెప్పారు. జీవితంలో కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా, అవి మన ఎదుగుదలకు అనుకూలంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఒకసారి లేదా రెండుసార్లు విఫలమైనా ప్రయత్నాన్ని ఆపకూడదు. ప్రతి తిరస్కరణ మనల్ని మరింత బలంగా, అనుభవజ్ఞులుగా తయారు చేస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు విజయం తప్పకుండా లభిస్తుందని మహేశ్వరి కథ కళ్ళకు కట్టినట్లు చెబుతుంది.

ఇదీ చదవండి: డబ్బు అవసరం ఉండదు!.. భవిష్యత్తులో..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement