పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉండాల్సిందే: మంత్రి శ్రీధర్బాబు
గ్రామీణ ప్రాధాన్యతగా 119 టెక్నాలజీ సెంటర్లు: మంత్రి వివేక్
సాక్షి, హైదరాబాద్/రాయదుర్గం: విద్య, పరిశ్రమ, ఉపాధిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి యువతను భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధం చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మార్కుల మెమోలతో డిగ్రీలను అందించే వ్యవస్థ నుంచి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో కూడిన యువతను తయారు చేసే గమ్యం వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు. రాయదుర్గంలోని టీ–వర్క్స్ ప్రాంగణంలో శనివారం జరిగిన ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్–అవార్డ్స్–2026 కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సుల నుంచి ఏటా 2 లక్షల మందికి పైగా గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని శ్రీధర్బాబు తెలిపారు. వారికి డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ ప్రస్తుత ఉద్యోగ మార్కెట్లో డిగ్రీ ఒక్కటే సరిపోదన్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలు, ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే శక్తి, నిరంతరం నేర్చుకునే తత్వం అవసరమని చెప్పారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో సుమారు 20 వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
గ్రామీణ విద్యార్థులకు స్టైపెండ్
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాలు మెరుగుపర్చి మంచి ఉద్యోగం పొందేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కారి్మక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా రాష్ట్రంలోని 119 టెక్నాలజీ సెంటర్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన విద్యార్థులకు స్టైపెండ్ ఇచ్చి నైపుణ్యాలను నేరి్పస్తున్నామన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ నిర్వాహకులు రమణ, క్రిష్, టీ–వర్క్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల, టాస్క్ సీఈవో నితిన్రెడ్డి పాల్గొన్నారు.


