
ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో చెప్పలేం. మార్కెట్లో ఒక్కో వస్తువు ఒక్కోసారి ట్రెండ్ అవుతుంది. అదే క్రమంలో ఇప్పుడు ఓ బొమ్మ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. స్టోర్లలో అల్లర్లకు కారణమైంది. సెలబ్రిటీల ఫేవరెట్ గా మారింది. దాని సృష్టికర్త సంపదను అమాంతం పెంచేసింది. ఎంతలా అంటే 24 గంటల్లో రూ.13,600 కోట్లకు పైగా సంపాదించేంతలా...
చైనీస్ బొమ్మల కంపెనీ పాప్ మార్ట్ ఇంటర్నేషనల్ గ్రూప్ సీఈఓ వాంగ్ నింగ్ సంపద ఒక్క రోజులోనే 1.6 బిలియన్ డాలర్లు (రూ.13,600 కోట్లకు పైగా) పెరిగింది. ఆ సంస్థ సృష్టించిన ‘లబుబు’ (Labubu) బొమ్మలే ఇందుకు కారణం. విచిత్రమైన గ్రెమ్లిన్ ముఖంతో రూపొందించిన ఈ బుజ్జి బొమ్మల క్రేజ్ ప్రపంచాన్ని ఊపేసింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ గర్ల్ గ్రూప్ బ్లాక్పింక్ లీసా, రోస్, రిహన్నా, అనన్య పాండే వంటి చాలా మంది సెలబ్రిటీల దగ్గర ఈ లబుబు బొమ్మలు కనిపించాయి.

టాప్ డౌన్లోడింగ్ యాప్
లబుబు బొమ్మల క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఈ బొమ్మల కోసం కస్టమర్లు గొడవపడటంతో పాప్ మార్ట్ యూకేలో ఇన్ స్టోర్ అమ్మకాలను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆన్లైన్లో ఈ బొమ్మలు విక్రయించే పాప్ మార్ట్ మొబైల్ యాప్ అమెరికాలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న షాపింగ్ యాప్గా నిలిచింది, ఇది వాంగ్ నింగ్ నెట్వర్త్ను 18.7 బిలియన్ డాలర్లకు పెంచింది.

లబుబు బొమ్మతో బ్లాక్పింక్ రోస్
ఏప్రిల్ 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, వాంగ్ నింగ్ అమెరికాలో తన కంపెనీకి పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా ఒక్క రోజులో 1.6 బిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, అమెరికన్లు లబుబు బొమ్మలను కొనడానికి గంటల తరబడి క్యూ కట్టారు. ఫోర్బ్స్ ప్రకారం వాంగ్ నింగ్ రియల్ టైమ్ నెట్వర్త్ 18.7 బిలియన్ డాలర్లుగా ఉంది.