భారత ఐటీ రంగంలో గత కొన్ని నెలలుగా నిశ్శబ్దంగా రగులుతున్న వేతనాల అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైంది. చెన్నై వేదికగా జరిగిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ అంతర్గత వార్షిక కార్యక్రమంలో చోటుచేసుకున్న అనూహ్య సంఘటన ఇప్పుడు దేశీయ టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. కంపెనీ సీఈఓ సి.విజయకుమార్ వేదికపైకి రాగానే సభలో పాల్గొన్న వందలాది మంది ఉద్యోగులు ఒకేసారి ‘మాకు జీతాల పెంపు కావాలి’ అంటూ నినాదాలు చేయడం, దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ కావడం ఐటీ వర్గాల్లో కలకలం రేపింది.
లాభాల పంట.. వేతనాల్లో కోత!
ఈ సంఘటన కేవలం ఒక కంపెనీకి చెందిన తాత్కాలిక నిరసనగా చూడలేం. కరోనా అనంతర కాలంలో గ్లోబల్ టెక్ రంగం కేవలం ఆర్థిక మందగమనాన్ని మాత్రమే ఎదుర్కొవడం లేదు.. తీవ్రమైన మానవ వనరుల సంక్షోభాన్ని కూడా మోస్తోంది. హెచ్సీఎల్తో పాటు పలు ప్రముఖ భారతీయ ఐటీ దిగ్గజాలు ఆరోగ్యకరమైన త్రైమాసిక లాభాలను నమోదు చేస్తున్నప్పటికీ అప్రైజల్స్ (జీతాల పెంపు) విషయంలో తీవ్ర ఆలస్యం వహిస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టుల తగ్గింపు, వ్యయ నియంత్రణ పేరుతో మేనేజ్మెంట్లు తీసుకుంటున్న నిర్ణయాలు క్షేత్రస్థాయి ఇంజినీర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలు పెరగకపోవడం, పదోన్నతులు నిలిచిపోవడంతో ఉద్యోగుల్లో సహనం నశించిందనడానికి ఈ ఘటనే నిదర్శనం.
కార్పొరేట్ సంస్కృతిలో మార్పు
సాధారణంగా భారతీయ ఐటీ ఉద్యోగులు క్రమశిక్షణకు, అంతర్గత నిబంధనలకు కట్టుబడి ఉంటారు. తమ నిరసనలను అధికారిక ఈ-మెయిల్స్ లేదా హెచ్ఆర్ సమావేశాలకే పరిమితం చేస్తారు. అయితే, ఏకంగా కంపెనీ అత్యున్నత నాయకత్వం (సీఈఓ) కళ్ల ముందే బహిరంగంగా నినాదాలు చేశారంటే ఉద్యోగుల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కార్పొరేట్ కమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపుతోంది.
When the CEO of HCL came on stage, employees started chanting, "We want a hike!" pic.twitter.com/hty1tNGp26
— Nandkishor (@devops_nk) July 27, 2026
పరిశ్రమకు హెచ్చరిక
ఈ చెన్నై ఘటన ఐటీ యాజమాన్యాలకు ఒక బలమైన హెచ్చరిక. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, రీ-స్కిల్లింగ్ సవాళ్ల మధ్య ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తే అది కంపెనీ ఉత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. మేనేజ్మెంట్లు ఇప్పటికైనా ప్రాజెక్టు లాభాలకే ప్రాధాన్యం ఇవ్వకుండా పారదర్శకమైన వేతన విధానాలను అమలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ!


