ఇంటి గోడలు మెరుస్తాయ్‌.. | 3d wallpapers make homes brighter | Sakshi
Sakshi News home page

ఇంటి గోడలు మెరుస్తాయ్‌..

Jun 22 2025 5:56 PM | Updated on Jun 22 2025 5:58 PM

3d wallpapers make homes brighter

సాక్షి, సిటీబ్యూరో: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్‌ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్‌ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్‌ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్‌ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇళ్లయినా వాల్‌ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.

మార్కెట్లో వాల్‌ పేపర్లు రోల్స్‌ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్‌ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10*10 ఉంటే కనీసం రెండు రోల్స్‌ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకు ఉంటుంది.

త్రీడీలో వాల్‌.. 
మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్‌ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్‌ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్‌ వాల్‌ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్‌ పేపర్లు సుమారు 1*1 సైజ్‌ నుంచి 20*20 సైజ్‌ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్‌ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement