breaking news
House walls
-
ఇంటి గోడలు మెరుస్తాయ్..
సాక్షి, సిటీబ్యూరో: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇళ్లయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు.మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10*10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకు ఉంటుంది.త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1*1 సైజ్ నుంచి 20*20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
ఇసుక, సిమెంట్ లేకుండానే.. గోడలకు ప్లాస్టరింగ్!
సాధారణంగా మనం చూసే భవనాలన్నీ ఇసుక, సిమెంట్ కలిపిన ఆర్సీసీ కాంక్రీట్ లేదా మైవాన్ అల్యూమీనియంతో ఉంటాయి. పైకప్పు, గోడలు అన్నీ వీటితోనే నిర్మిస్తుంటారు. దీంతో ఈ ఇళ్లలో వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా ఇసుక, సిమెంట్ ధరల పెరుగుదల కారణంగా గోడలు, ప్లాస్టరింగ్లకు అయ్యే ఖర్చు తడిసిమోపడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఖనిజ జిప్సం అందుబాటులోకి వచ్చేసింది. ఇసుక, సిమెంట్ అవసరం లేకుండానే నేరుగా ఇటుకల మీదపూతలాగే పూయడమే మినరల్ జిప్సం పన్నింగ్ ప్రత్యేకత. పైగా దీనికి చుక్క నీటితో క్యూరింగ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సం ఇళ్లలో గది ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. – సాక్షి, సిటీబ్యూరోమన దేశంలో అపారమైన నదుల కారణంగా ఇసుక లభ్యత ఎక్కువ. దీన్ని ఆసరా చేసుకొని బ్రిటీష్ రాజులు మన దేశంలో సిమెంట్ కర్మాగారాలు నెలకొల్పి, అందుబాటులో ఉన్న ఇసుకను కలిపి నిర్మాణ రంగంలో వినియోగించడం మొదలు పెట్టారు. కాలక్రమేణా నది ఇసుక కొరత ఏర్పడటంతో రోబో శాండ్ మార్కెట్లోకి వచ్చింది. దీనికి పట్టుత్వం తక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జిప్సం వినియోగం పెరిగింది. భూగర్భంలో బంగారం, బొగ్గు, ఇనుము వంటి గనులలాగే జిప్సం కూడా ఖనిజమే. మన దేశంలో రాజస్థాన్లోని బికానెర్, కశ్మీర్ వ్యాలీలో మాత్రమే మినరల్ జిప్సం గనులు ఉన్నాయి. మార్కెట్లో కాంపోజిట్, మినరల్ జిప్సం అని రెండు రకాలు ఉంటాయి. సిమెంట్ పరిశ్రమల వ్యర్థాల నుంచి వెలువడే తెల్లటి పదార్థాన్ని కాంపోజిట్ జిప్సం అంటారు. దీన్ని ఇటుక, చాక్పీస్ తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మినరల్ జిప్సం భూగర్భంలో నుంచి వెలికితీసే గని. దీని రసాయన నామం కాల్షియం సల్ఫేట్ డీహైడ్రేట్ (సీఏఎస్ఓ4).అంతర్గత గోడలు, సీలింగ్లకే.. ఖనిజ జిప్సంకు నిరంతరం నీరు తాకితే తేమ కారణంగా పాడైపోతాయి. అందుకే దీన్ని ఇంటి లోపల అంతర్గత గోడలు, సీలింగ్లకు మాత్రమే వినియోగిస్తారు. బయట గోడలకు, బాత్రూమ్, టాయిలెట్స్ గోడలకు వినియోగించరు. ఆర్సీసీ కాంక్రీట్ను తాపీతో వేయాలి లేకపోతే చేతులు, కాళ్లకు పొక్కులు వస్తాయి. అదే మినరల్ జిప్సంను నేరుగా చేతులతో కలుపుతూ గోడలకు పూత లాగా పూస్తారు. ఈ గోడలు చాలా తేలికగా ఉండటంతో ఇంటి శ్లాబ్ మీద బరువు పెద్దగా పడదు. మినరల్ జిప్సంను నివాస, వాణిజ్య, కార్యాలయ అన్ని రకాల భవన సముదాయాల నిర్మాణంలో వినియోగిస్తారు.ఎంత ఖర్చు అవుతుందంటే.. ఆర్సీసీ కాంక్రీట్తో చదరపు అడుగు గోడ ప్లాస్టరింగ్ రూ.50–55 ఖర్చు అవుతుంది. అదే జిప్సం పన్నింగ్కు అయితే రూ.35–40తో అయిపోతుంది. అలాగే చ.అ. కాంక్రీట్ గోడ క్యూరింగ్కు 7 లీటర్ల నీళ్లు అవసరం కాగా.. కనిష్టంగా ఏడు రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక, జిప్సం గోడలకు క్యూరింగే అవసరం లేదు. ఉదాహరణకు.. త్రీ బీహెచ్కే ఫ్లాట్లో అంతర్గత గోడలు నాలుగు వైపులా కలిపితే 5 వేల చ.అ. ఉంటాయి. వీటి క్యూరింగ్కు 25 వేల నీళ్లు అవసరం అవుతాయి. ఈలెక్కన ఖనిజ జిప్సంతో నీళ్లు, సమయం, డబ్బు ఆదా అవుతుందన్నమాట.ఇళ్లంతా చల్లగా.. మినరల్ జిప్సంకు వేడి, అగ్ని, ధ్వనిని నిరోధించే శక్తి ఉంటుంది. ఇందులోని థర్మల్ ప్రూఫ్ కారణంగా బయటితో పోలిస్తే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఖనిజ జిప్సంతో ఉండే ఇంట్లో చల్లదనం కోసం ఏసీ ఎక్కువ సమయం వేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మినరల్ జిప్సంకు అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయి. నింతరంగా మూడు గంటల పాటు అగ్నిని నిరోధిస్తాయి. ఖనిజ జిప్సంతో కట్టే గోడలు చాలా మృదువుగా, పాలవలే తెల్లగా ఉంటాయి. దీంతో చూసేందుకు ఎంతో అందంగా ఉంటాయి. -
ఎరక్కపోయి.. ఇరుక్కుపోయాడు
♦ ఆడుకుంటూ ఇరుకైన గోడల మధ్య చిక్కుకున్న బాలుడు ♦ వైఎస్సార్ జిల్లాలో నాలుగు గంటలు ఉత్కంఠ ♦ ఎట్టకేలకు రక్షించిన అగ్నిమాపక సిబ్బంది లక్కిరెడ్డిపల్లె: దసరా సెలవుల్లో దాగుడుమూతలాట ఓ పిల్లాడి ప్రాణాలు మీదికి తెచ్చింది. రెండు ఇళ్ల ఇరుకైన గోడల మధ్య నాలుగు గంటల పాటు ఇరుక్కుపోయిన ఆ బాలుడిని చివరకు అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం చింతకుంటవాండ్లపల్లెలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాలివీడు మండలం పూలుకుంట గ్రామానికి చెందిన ఫరూక్(6) దసరా సెలవులు కావడంతో రెండురోజుల క్రితం అమ్మమ్మగారి ఊరైన చింతకుంటవాండ్లపల్లెకు వచ్చాడు. గురువారం పిల్లలంతా కలసి దాగుడుమూతలాట ప్రారంభించారు. ఎవరికీ కనబడకుండా దాక్కోవాలని భావించిన ఫరూక్ సమీపంలోని రెండు ఇళ్ల గోడల మధ్య ఉన్న 20 అడుగుల పొడవైన ఇరుకైన సందులోకి వెళ్ళి ఇరుక్కుపోయాడు. దాదాపు 10 అడుగుల మేర లోపలికి వెళ్లిన అతను బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఏడుపు లంకించుకున్నాడు. బాలుడి ఏడుపు విన్న ఆ ఇళ్లలోని వారు అతని కుటుంబసభ్యులకు విషయం తెలియజేశారు. వారు స్థానికుల సహకారంతో పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. అగ్నిమాపక అధికారి గాబ్రియేల్ సిబ్బందితో పూలుకుంట చేరుకుని డ్రిల్లింగ్ మిషన్ సాయంతో ఓ ఇంటి గోడను తొలగిస్తూ వెళ్లి బాలుడ్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో 4 గంటలపాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అగ్నిమాపక సిబ్బందిని గ్రామస్తులందరూ అభినందించారు.